- అశ్వరావుపేట చెక్ పోస్టులో యథేచ్ఛగా వసూళ్లు
- చెక్ పోస్ట్ దాటాలంటే మామూళ్లు సమర్పించాల్సిందే..
- ఏసీబీ రైడ్ లు జరిగినా ఆగని మామూళ్ల దందా…?
Ashwarao pet Check Post : మంత్రులుంటే మాకేంటి…?మా లెక్క మాకొచ్చిందా? లేదా..? ఏ వాహనం అయినా సరే మేము డిసైడ్ చేసిన మామూళ్లు సమర్పించాల్సిందే. ఏమన్నా అయితే మా ఉన్నతాధికారులు చూసుకుంటారనే రీతిలో ఆ చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాహనదారుల నుండి యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఉమ్మడి జిల్లాకు లేని ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దక్కిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ప్రభుత్వంలో హేమాహేమీలుగా పేరుగాంచిన ముగ్గురు మంత్రులు అనగా మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పటికీ అశ్వరావుపేట చెక్ పోస్ట్ లో మాత్రం అక్రమ వసూళ్లు ఆగడంలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆ చెక్ పోస్ట్ పూర్తిగా అవినీతి మయం అయినట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఆ చెక్ పోస్ట్ ఉన్న జిల్లాలో ముగ్గురు కీలకమైన మంత్రులు ఉన్న విషయం అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్టీఏ అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి అదురుబెదురు లేకుండా వసూళ్లకు పాల్పడుతున్నారంటే వారికి ఉన్నతాధికారుల ఆశీస్సులు ఏస్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
Check Post : పోస్ట్ దాటాలంటే సమర్పిచాల్సిందే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట చెక్ పోస్ట్ నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది.ఏ వాహనం అయినా సరే ఈ చెక్ పోస్ట్ ను దాటాలంటే ఆర్టీఏ అధికారులు నియమించుకున్న ప్రైవేట్ సిబ్బందికి మామూళ్లు చెల్లించాల్సిందేనని, లేదంటే మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ల నుండి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వాహనదారులు కోడై కూస్తున్నారు.ఈ చెక్ పోస్ట్ లో ఒక్కో వాహనానికి ఒక్కో రేటు ఉంటుందని, వాహనాన్ని బట్టి పైకం చెల్లించాలని తెలిసింది. ఇలా వాహనదారుల నుండి ప్రైవేట్ వ్యక్తులు మామూళ్ల రూపంలో వసూళ్లు చేసిన మొత్తాన్ని డ్యూటీ అయిపోగానే అధికారులకు అప్పగిస్తారని సమాచారం.
ఏసీబీ రైడ్ లు జరిగినా మారని అధికారుల తీరు..?
అశ్వరావుపేట చెక్ పోస్టులో ఇప్పటికే పలుమార్లు ఏసీబీ రైడ్ లు జరిగినప్పటికీ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడంలేదని తెలుస్తోంది.సదరు చెక్ పోస్టులో రవాణా శాఖ నిబంధనలు అమలు కావని ఆ సీనియర్ ఎంవీఐ నిబంధనలు మాత్రమే అమలవుతున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎంవీఐ లు, ఏఎంవీఐ లు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అదురు, బెదురు లేకుండా వాహనదారుల నుండి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు తరచూ తనిఖీలు చేస్తున్నప్పటికీ వీరిలో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదని వాహనదారులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.అవినీతి నిరోధక శాఖ తోపాటు, ఆర్టీఏ ఉన్నతాధికారుల నుండి కాపాడేందుకు సీనియర్ ఎంవీఐ ఉన్నాడనే ధీమాతోనే ఆ చెక్ పోస్టు లో అధికారులు వసూళ్లను ప్రోత్సహిస్తూ ప్రైవేట్ వ్యక్తులతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
One thought on “Check Post : మంత్రులుంటే మాకేంటి..?”