- అశ్వరావుపేట చెక్ పోస్టు ను శాసిస్తున్న ప్రైవేట్ వ్యక్తి
- ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైందా? ముడుపులే కారణమా?
Corruptions at Check Post : ఆ చెక్ పోస్ట్ లో ప్రైవేట్ వ్యక్తి హవా జోరుగా కొనసాగుతోందట, గత కొన్నిసంవత్సరాలుగా ఆ చెక్ పోస్ట్ ను శాసిస్తున్న సదరు వ్యక్తి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లకు కూడా పెద్దదిక్కు గా మారినట్లు ప్రచారం లేకపోలేదు. చెక్ పోస్ట్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటికీ వసూళ్ల వ్యవహారం మొత్తం “సూర్యుడి” లాంటి ఆ వ్యక్తి కనుసన్నల్లోనే ఉంటుందని తెలుస్తోంది, వాహనదారుల నుండి వసూళ్లు చేయడం ,వసూళ్ళు చేసిన మొత్తాన్ని హోదాల వారీగా వాటాలు పంచడంలో సదరు వ్యక్తి సిద్ధహస్తుడని సమాచారం. అశ్వరావుపేట చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (Motor Vehicle Inspector) లకు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లకు ఈ “సూర్యుడు”ఎంతచెబితే అంతే అని, ఆయన ఇచ్చిందే డ్యూటీ ల వారీగా (మామూళ్లు) తీసుకుంటారని చెక్ పోస్ట్ లో ప్రచారం జరుగుతోంది.
పట్టుబడితే దొరక్కుండా ఉండేందుకే..
అశ్వరావుపేట చెక్ పోస్టు (Ashwaraopet Check Post ) లో రోజు వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఆ చెక్ పోస్ట్ ను దాటాలంటే వాహనాన్ని బట్టి ముడుపులు చెల్లించాల్సిందేననేది బహిరంగ రహస్యమేనట. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఆర్టీఏ అధికారులు ఎక్కడ కూడా బహిరంగంగా వసూళ్ల వ్యవహారంలో పాల్గొనరని తెలుస్తోంది. ఈ చెక్ పోస్టు లో ఎలాంటి వసూళ్లు జరగాలన్న,ఏ వాహన యజమాని అమ్యామ్యాలు చెల్లించాలన్న సూర్యుడు నియమించిన ప్రైవేట్ సైన్యమే వసూళ్లు చేస్తారని సమాచారం. చెక్ పోస్ట్ లో సదరు సూర్యుడు ఎంత వసూళ్లు చేస్తే మనకేంటి డ్యూటీ వారిగా మనకు వచ్చేది వస్తుందా? లేదా? అని మాత్రమే ఆర్టీఏ అధికారులు చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.వాహనదారుల నుండి వసూళ్లు చేస్తున్న క్రమంలో అవినీతి నిరోధక శాఖ కు పట్టుబడితే ఎలాగూ ప్రైవేట్ సైన్యమే పట్టుబదడుతారని ,తమకేం డోకా లేదని భావిస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు సూర్యుడి ప్రైవేట్ సైన్యం చేతనే వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
పర్యవేక్షణ లోపమా..? ముడుపులే కారణమా?
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలోని అశ్వరావుపేట చెక్ పోస్టు (Ahwaraopet Check Post ) లో అవినీతి రాజ్యమేలుతున్న విషయం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా రవాణా శాఖ ఉన్నతాధికారులకు తెలుస్తున్నప్పటికి వారు అవినీతి ని ఎందుకు కట్టడి చేయడంలేదో అర్థంకాని పరిస్థితి. చెక్ పోస్టులో యథేచ్ఛగా అధికారులు నియమించుకున్న ప్రైవేట్ సైన్యం వసూళ్లకు పాల్పడుతున్నా, ఉన్నతాధికారులు ఎందుకు గమ్మునుంటున్నారో వారికే తెలియాలి. ఆ చెక్ పోస్ట్ పై ఇప్పటికే పలుమార్లు ఏసీబీ రైడ్ లు జరిగినప్పటికీ రవాణా శాఖ (Transport Department) ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదంటే అసలు పర్యవేక్షణ లోపమా? లేదంటే ముడుపులే కారణమా అని వాహనదారులు పలురకాలుగా చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.