- పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యం అంటూ గ్రామాల్లో జోరుగా ప్రచారం
- సామాన్యుల్లో గుబులు రేపుతున్న కాంగ్రెస్ లీడర్ ల మాటలు
- పారదర్శకత మాటలకే పరిమితమా? లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తారా?
- లబ్ధిదారుల ఎంపికలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఉంటుందా?
Indiramma Illu | తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇందిరమ్మ గృహ పథకం కీలక భూమిని పోషించిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing scheme) ప్రారంభించి హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏడాదికి 4.5 లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దానిలోభాగంగానే ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3500 ల ఇండ్లను మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు విడతల వారిగా ప్రభుత్వం అందించనుంది.ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ (Indiramma App) ను కూడా తీసుకువచ్చింది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎంపిక విధానం పై నిరుపేదల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మాకు ఇల్లు వస్తుందా, మమ్మల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతనిస్తారా? అనే రకరకాల ప్రశ్నలు సామాన్య ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో కార్యకర్తలకే ప్రాధాన్యత అంటూ ప్రచారం..
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయటం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ ని తీసుకువచ్చింది. సర్వేయర్ లు ఇంటిటికి తిరిగి దరఖాస్తు దారుల వివరాలను నమోదు చేస్తున్నారు.సొంత ఇల్లు లేని వారిని ఈ పథకానికి ఎంపిక చేస్తామని ,లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని అటు ముఖ్యమంత్రి తోపాటు, మంత్రులు, ఎమ్మెల్యే లు పదే పదే చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం మరో రకంగా జరుగుతుంది.మొదటగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన తర్వాతే మిగిలిన వారికి ఇందిరమ్మ గృహాలు వస్తాయని చోటమోటా లీడర్లు ప్రచారం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఇచ్చిన తర్వాతే వేరే వారిని ఎంపికచేయాలని అంతర్గతంగా పార్టీ కార్యకర్తలు తీర్మానాలు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యే లు సైతం పార్టీ అంతర్గత సమావేశాల్లో కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని బాహాటంగానే చెప్తున్నారట.
బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా ఉంటుందా..?
10 సంవత్సరాల బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ప్రతి పథకం లో కార్యాకర్తలకే ప్రాధాన్యతనిచ్చారని, నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండేనా అని ఏ పార్టీకి సంబంధంలేని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొన్ని పథకాల ఎంపికలో …. ఏపార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యతను ఇచ్చి సామాన్యులను పక్కన పెట్టడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తోంది. మరీ ముఖ్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని పథకాల అమలులో పారదర్శకత పాటించలేదని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సిందేనని ప్రజలు అంటున్నారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపికతోనే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా తెలిసిపోనుందని ప్రజలు మాట్లాడుకోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..