Jammu Kashmir | కశ్మీర్ లోయలోని శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, శ్రీనగర్ (Srinagar ) రైల్వే స్టేషన్ మధ్య నడిపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (Vande Bharat train) మొదటి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. భారతీయ రైల్వే తన విజయవంతమైన ట్రయల్ గురించి శనివారం వెల్లడించింది. ఈ రైలు తన ప్రయాణంలో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ వంతెన (Chenab Bridge) గుండా వెళ్ళింది. ప్రత్యేక వందే భారత్ కూడా అంజి ఖాడ్ వంతెన గుండా ప్రయాణించింది. ఇది దేశంలోని మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెన. జమ్మూలో ఉదయం 11:30 గంటలకు రైలు కొంతసేపు ఆగింది, అక్కడ ప్రజలు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. రైల్వే శాఖ ప్రకారం, ట్రయల్ పూర్తయిన తర్వాత దాని వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ రైలు షెడ్యూల్ ను ఇంకా ప్రకటించనప్పటికీ, త్వరలో PM నరేంద్ర మోదీ ఈ రైలు మొదటి ప్రయాణాన్ని కత్రా నుంచి ఫ్లాగ్ చేయనున్నారు.
గడ్డకట్టే చలిలోనూ అదే స్పీడ్..
కత్రా-శ్రీనగర్ (katra to Srinagar ) మధ్య నడిచే వందే భారత్ రైలను ప్రత్యేక పద్ధతిలో రూపొందించారు. ఈ రైలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణంలో ప్రయాణిస్తుంది. గడ్డకట్టుకుపోయే చలి, మంచుతుఫాను కురిసే సమయాల్లో కూడా పూర్తి వేగంతో నడిచేలా దీనిలో మార్పులు చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పోలిస్తే, ఈ రైలులో అనేక ప్రత్యేక సౌకర్యాలను అభివృద్ధి చేశారు. రైల్వేస్ ప్రకారం, ఇందులో అధునాతన హీటింగ్ వ్యవస్థలు ఉన్నాయి, ఇవి నీరు, బయో-టాయిలెట్ ట్యాంక్లను గడ్డకట్టకుండా చూస్తాయి. అలాగే వాక్యూమ్ సిస్టమ్ కోసం వేడి గాలిని అందిస్తుంది. ఇది కాకుండా, ప్రత్యేక వందే భారత్లో ఎయిర్ బ్రేక్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు, ఇది సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతలో కూడా కచ్చితంగా పనిచేస్తుంది. రైలు విండ్షీల్డ్లో పొందుపరిచిన హీటింగ్ ఎలిమెంట్లను కూడా కలిగి ఉంది. ఇది డ్రైవర్ ముందు ఉన్న లుకౌట్ గ్లాస్ను ఆటోమేటిక్గా డీఫ్రాస్ట్ చేస్తుంది. ఈ లక్షణాలు విపరీతమైన చలిలో కూడా ముందు వైపు స్పష్టంగా కనిపించేలా చేస్తాయి.
Jammu Kashmir : కాశ్మీర్ ను దేశంతో అనుసంధానించేందుకు భారీ ప్రణాళిక
ఈ రైలులో ఇప్పటికే ఉన్న వందే భారత్ రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ కోచ్లు, ఆటోమేటిక్ గేట్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) కు ఇప్పటివరకు ఉన్న భౌగోళిక, ఆర్థిక అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని అందుకు ఈ ప్రత్యేక వందే భారత్ ప్రతీక అని భారతీయ రైల్వే విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కాశ్మీర్ లోయను భారతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానించే లక్ష్యంతో 272 కి.మీ పొడవైన ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఈ రైలు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..