- క్రమశిక్షణా కమిటీ ముందు భేటీ..
- ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలపై 15పేజీలతో నివేదిక అందజేత
- జిల్లా పార్టీ నేతలకు రివర్స్ కౌంటర్!
- వరంగల్ కాంగ్రెస్లో కలకలం
Warangal Politics : కొండా మురళి (Konda Murali) వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై శనివారం గాంధీ భవన్ (Gandhi Bhavan) లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశమైంది. అయితే కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని.. పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంటుందని అనుమానిస్తున్న తరుణంలో అనూహ్యంగా కొండా మురళి రివర్స్ కౌంటర్కు దిగారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్ కీలక నేతలపైనే కమిటీ (Disciplinary Committee)కి 15 పేజీలతో కూడిన నివేదిక అందించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్ గా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(Kadiyam Srihari), రేవూరి ప్రకాశ్ రెడ్డి (Revuri Prakash Reddy), హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డిపై కొండా మురళి క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండా మురళి నివేదిక అందజేశారు.
కొండా నివేదిక ప్రకారం: స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థిని కడియం శ్రీహరి బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవూరి ప్రకాశ్ రెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నారని, అక్రమ క్రషర్ కు ప్రోత్సహిస్తున్నాడని నివేదికలో పేర్కొన్నారు. ఇక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా తన నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు.
ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణ కమిటీ సభ్యులను కోరారు. కమిటీ ఈ నివేదికను స్వీకరించి విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
క్రమశిక్షణ కమిటీతో ఏమన్నారు?
పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందు కొండా మురళి మాట్లాడుతూ, “నన్నెవరూ పిలవలేదు. పార్టీపై గౌరవంతోనే నేనే వచ్చా. నా వ్యక్తిత్వాన్ని సేవలను నిరాకరించే హక్కు ఎవరికీ లేదు,” అని స్పష్టం చేశారు. భూపాలపల్లి నుంచి నేనే పోటీ చేయాలని అనుకున్నాను. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ పోటీ చేసింది కాబట్టి నేను తప్పకున్నా. మరో పార్టీ నుంచి గండ్ర వొచ్చినా ఆయన మద్దతు ఇచ్చి ప్రచారం చేశాను. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు.
మరోవైపు వేం నరేందర్ రెడ్డి సీటు రాకపోవడానికి నేనే కారణమని నాపై కోపంగా ఉన్నట్టున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వొచ్చేటప్పుడు రాజీనామా చేసే వచ్చాను. అలాగే తనతోపాటు 26 మంది కార్పొరేటర్లను తీసుకోవచ్చాను అని పేర్కొన్నారు.. కొందరి మాదిరిగా పార్టీ మారి పదవిని ఎంజాయ్ చేయడం లేదన్నారు. ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని నేను అని కమిటీకి నిచ్చిన నివేదికలో కొండా మురళి పేర్కొన్నారు.
పొంగులేటిపై కొండా మురళి ఆరోపణలు
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy )పై కూడా కొండా మురళి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పొంగులేటి, తమపై కక్షతో కుట్రలు పన్నుతూ, వరంగల్ జిల్లాలోని వ్యతిరేక నాయకులను పోగేస్తున్నారని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉండడంతో ఈ ఆరోపణలకు ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక ఎన్నికల సన్నాహాల సమయంలో ఈ ఆరోపణలు పార్టీలో మరింత దుమారాన్ని రేపుతున్నాయి.
Warangal Politics : బయటపడిన అంతర్గత విభేదాలు..
Warangal Politics : ఇటీవల కొండా మురళి (Konda Murali) చేసిన వ్యాఖ్యలతో భగ్గుమన్న వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు అత్యవసరంగా సమావేశమై AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. వారి జోక్యంతో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ కొండా మురళికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనతో ఓరుగల్లు కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిన వాతావరణం ఏర్పడింది. పార్టీలో అంతర్గత విభేదాలు మరింతగా బయటపడినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికి పార్టీ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, వర్గపోరుతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్కు కొత్త తలనొప్పిగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.