Maha Kumbh mela 2025 : మహా కుంభమేళా భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహోత్సవానికి ఏర్పాట్లను సర్వం సిద్ధం చేస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించే ఈ భక్తజన జాతర ప్రపంచంలోనే అతి పెద్దది. ఈసారి (2025) మహాకుంభమేళాలో 40-45 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వాలు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నాయి.
మోక్ష ప్రాప్తికి అరుదైన అవకాశం
గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో నిర్వహించే మహోత్సవం మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 45 రోజులపాటు జరిగే ఆధ్యాత్మిక ఉత్సవం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యకార్యాల క్షేత్రంగా మహాకుంభమేళా నిలుస్తుంది. ఇందులో పాల్గొనడంతో తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. పూర్వీకుల పాపాలను కడగకట్టేందుకు, మోక్షం పొందేందుకు అరుదైన అవకాశంగా విశ్వసిస్తారు. ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు, యజ్ఞాలు, భజనలు, ఆధ్యాత్మిక సమావేశాలు, ఆధ్యాత్మిక చర్చలు ప్రధాన ఘట్టాలుగా జరుగుతాయి.
Maha Kumbh mela .. అద్భుత అనుభూతి
మహాకుంభమేళా మహోత్సవం అనేది భక్తుల నమ్మకాలను, భారతీయ సంస్కృతి వైభవాన్ని, విశ్వవ్యాప్త ఆధ్యాత్మికతను చాటిచెప్పే గొప్ప ఘట్టం. ఈ సందర్భం భక్తులను మాత్రమే కాక, ప్రపంచాన్ని భారతీయ ఆధ్యాత్మిక విలువల వైపు ఆకర్షిస్తుంది. పూర్వం, ప్రస్తుతం, భవిష్యత్తు తరాలకు భారతీయ ఆధ్యాత్మిక సంపదను జ్ఞాపకం చేస్తూ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.
అందుబాటులోకి ప్రత్యేక సౌకర్యాలు
మహాకుంభమేళాను నిర్వహించేందుకు భారతీయ రైల్వే, ప్రభుత్వ సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం రైళ్లలో అదనపు కోచ్లు, ప్లాట్ఫారమ్ విస్తరణలు, ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేశారు.
రైల్వే శాఖ కీలక ఏర్పాట్లు
మహా కుంభమేళా 2019 లో సుమారు 24 కోట్ల మంది భక్తులు రాగా ఈసారి 40-45 కోట్ల మంది రావచ్చని అంచనా ఉంది. ఈ భారీ సంఖ్యను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ప్రయాగ్ జంక్షన్, ఫాఫామౌ, ప్రయాగ్ఘాట్ స్టేషన్లలో ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది.
ముఖ్యంగా హెల్ఫ్లైన్ కౌంటర్లు, ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్మెంట్ రూములు, డిజిటల్ లాకర్లు, క్లాక్ రూములు, మొబైల్ చార్జింగ్ కియోస్క్లు, ఏటీఎంలు, ఏసీ వెయిటింగ్ రూములు, బేబీ ఫీడింగ్ రూములను అందుబాటులో ఉంచింది. ప్రయాగ్ స్టేషన్లో 140, ఫాఫామౌ స్టేషన్లో 110, ప్రయాగ్ఘాట్ స్టేషన్లో 42 ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు ప్రభుత్వ రికార్డుల ఆధారంగా నేరస్థులను గుర్తిస్తాయి. యూపీ పోలీసులతో కలిసి ఈ సాంకేతికతను అమలు చేయనున్నారు.
మహాకుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
- మహా కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రయాగ్రాజ్ వస్తున్న ప్రధాన రైళ్లల్లో కోచ్ల సంఖ్యను పెంచుతున్నారు. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ , లక్నో మెయిల్ లాంటి రైళ్లు ప్రత్యేకంగా భక్తుల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రత్యేకంగా కనెక్టివిటీ కోసం చార్బాగ్ స్టేషన్, ప్రయాగ్ జంక్షన్ ప్లాట్ఫారమ్లను వినియోగిస్తున్నారు.
- లక్నో నుంచి ఢిల్లీకి నడిచే లక్నో మెయిల్, ప్రయాగ్రాజ్ వరకు నడిచే ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైళ్లల్లో త్వరలో ఒక్కో కోచ్ను పెంచనున్నారు. ఉత్తర రైల్వే లక్నో డివిజన్ డీఆర్ఎం ఎస్ఎం శర్మ బుధవారం ఈ మేరకు తెలిపారు. ఈ రైళ్లల్లో 24 కోచ్లను అమర్చడానికి ముందే అనుమతి ఉంది. కానీ కొన్ని స్టేషన్లలో ప్లాట్ఫారమ్ల పొడవు తక్కువగా ఉండటం వల్ల కేవలం 23 కోచ్లతో నడుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్లాట్ఫారమ్ల పొడవును పెంచినందున పూర్తి 24 కోచ్లను రైళ్లలో అమర్చనున్నారు.
లక్నో మెయిల్ కొన్ని సంవత్సరాలుగా లక్నో జంక్షన్ నుంచి నడుస్తోందని, 22 కోచ్లు మాత్రమే ఉండే ఈ రైలును చార్బాగ్ స్టేషన్ నుంచి 23 కోచ్లతో నడుపుతున్నామని డీఆర్ఎం తెలిపారు. త్వరలోనే మరో కోచ్ను జోడించి మొత్తం కోచ్ల సంఖ్యను 24కు పెంచనున్నామని వివరించారు. - ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలులో కూడా మరో కోచ్ను జోడించనున్నారు. ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీ వరకు నడిచే ఈ రైలులో ప్రస్తుతం 23 కోచ్లు మాత్రమే ఉన్నాయి. కొత్త మార్పులతో ఈ రైలులో 24 కోచ్లను అమర్చనున్నారు. ఈ నిర్ణయంతో ప్రయాణికుల సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..