Telangana Assembly : తెలంగాణ శాసనసభలో ఈ రోజు జరిగిన సమావేశం రసాభాసగా మారింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ( Motion of Thanks)పై చర్చ జరుగుతుండగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చివరకు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar ) వాయిదా వేయాల్సి వచ్చింది.
గవర్నర్ ప్రసంగం ఏఐ స్క్రిప్ట్ : బీఆర్ఎస్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Adi Srinivas) ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు ( BRS MLAs) వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి (BRS MLA Jagadish Reddy) చేసిన వ్యాఖ్య సభను మరింత వేడెక్కించింది. గవర్నర్ ప్రసంగాన్ని (Governor’s speech) పూర్తిగా నిరాధారంగా అభివర్ణించారు. ఇది ఒక ఏఐ తయారు చేసిన స్క్రిప్ట్ (AI generated script) లాంటిదని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అబద్ధాలతో నింపిందని, గవర్నర్ యాంత్రికంగా ఈ ప్రసంగాన్ని చదివారని ఆరోపించారు. కేవలం 36 నిమిషాల్లో గవర్నర్ 360 అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ దళితులకు భూ పంపిణీ, దళిత ముఖ్యమంత్రి హామీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని గుర్తుచేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో ముందుగా చెప్పండని బీఆర్ఎస్ సభ్యులను నిలదీశారు.
Telangana Assembly : సభలో ఉద్రిక్తత … స్పీకర్ జోక్యం
ఈ క్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకొని దయచేసి అంశానికి అతీతంగా మాట్లాడొద్దంటూ జగదీశ్రెడ్డిని ఉద్దేశించి అన్నారు. దీన్ని ఆయన వ్యతిరేకిస్తూ తాను అంశానికి అతీతంగా మాట్లాడటం లేదని, స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
జగదీశ్రెడ్డి క్షమాపణ చెప్పాలి : కాంగ్రెస్
జగదీశ్రెడ్డి మాట్లాడుతున్న తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన్ను సభ (Telangana Assembly) నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జగదీశ్రెడ్డి దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ వాగ్వాదం కొనసాగుతున్న సమయంలో బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) చర్చలోకి ప్రవేశించి ప్రతిపక్ష సభ్యులకు సభలో పూర్తిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాల్లో అధికార పార్టీ సభ్యులు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు.
వాగ్వాదం మధ్య సభ వాయిదా
రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరం కావడంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు స్పీకర్ (Telangana Assembly Speekar)ప్రసాద్ కుమార్ ప్రయత్నించారు. అయితే, వాతావరణం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. సభలో నియమాలను పాటించాలని స్పీకర్ వారించినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..