Khammam : రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Integrated Residential Schools) ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్భుతమైన మేదస్సుతో సమాజానికి మానవ వనరులను అందించాలన్నదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్దేశం అన్నారు. సాన పట్టిన వజ్రాల్లాగా తయారుచేసి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విధంగా విద్యా బుద్ధులు చెప్పే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని డిజైన్ చేశామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 58 రెసిడెన్షియల్ స్కూల్స్
రాష్ట్రవ్యాప్తంగా 58 రెసిడెన్షియల్ స్కూల్స్ ను మొదటి సంవత్సరంలోనే మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో అదనంగా మరో 47 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను మంజూరు చేశామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. రూ.21 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు కాబోతున్నాయని, ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు క్రికెట్, ఫుట్బాల్ అవుట్డోర్, ఇండోర్ ఆటలకు సంబంధించి క్రీడా ప్రాంగణాలు ఉండే విధంగా దాదాపు 25 ఎకరాల్లో డిజైన్ చేశామని వివరించారు.
Residential Schools : టీచింగ్ స్టాఫ్, విద్యార్థులకు హాస్టల్స్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్న విషయాల ప్రకారం.. విద్యార్థులతో పాటు టీచింగ్ స్టాఫ్ ఉండే విధంగా వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాల నిర్వాహణకు సంబంధించి వాటర్, విద్యుత్, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇందులోనే వసతి ఉండేలా డిజైన్ చేశారు. డిజిటల్ క్లాస్ రూమ్ లు, యాంపీ థియేటర్, సైన్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన చేసే అధ్యాపక బృందాన్ని నియమించనున్నారు. విద్యార్థులకు శరీర ధారుఢ్యం పెరిగే విధంగా కావలసిన పోషకాహారంతో కూడిన డైట్ ను అందించనున్నారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వ ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశానికి రోల్ మోడల్ గా నిలువబోతాయని డిప్యూటీ సీఎం అన్నారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణకు వచ్చి ఈ పాఠశాలలను సందర్శించి ఇదే తరహాలో విద్యాబుద్ధులు నేర్పాలనే ఆలోచనతో వారి రాష్ట్రాల్లో పాఠశాలల ఏర్పాటుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రోల్ మోడల్ అవుతాయన్నారు. రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న ప్రతి రూపాయి పోగేసి ప్రజల భవిష్యత్తు కోసం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం వెచ్చిస్తుందని వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.