Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మరోసారి మెట్రో రైలు టికెట్ రేట్లు పెంచాలని యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు ఎల్అండ్టీ, హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
రోజుకు కోటిన్నర రూపాయల నష్టం వస్తోందని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఇప్పటికీ వడ్డీలు చెల్లించలేకపోతున్నామని ఎల్అండ్టీ సంస్థ పేర్కొంటున్నది. అయితే ప్రయాణికులపై అదనపు భారం వేయొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ధరల పెంపునకు సుముఖంగా లేదని సమాచారం.
ఎల్అండ్టీ సంస్థ నగరంలో మెట్రో రైలు మొదటిదశ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ)లో 2012లో రూ.14,132 కోట్లతో పనులు ప్రారంభించి 2017 నవంబర్ లో పూర్తి అయ్యాయి. మూడు కారిడార్ల పరిధిలో ప్రయాణించే వారి సంఖ్య రోజూ సుమారు 5.10 లక్షలకు చేరింది. కరోనాకు ముందు రోజుకు రూ.80 లక్షలకు పైగా ఎల్ అండ్ టీ ఆదాయం సమకూర్చుకుంది. అయితే, 2020లో కరోనా లాక్డౌన్తో మెట్రో భారీగా దెబ్బతింది. 2022 నుంచి క్రమంగా కోలుకున్నా నష్టాల ఊబి నుంచి బయటపడలేదని చెబుతోంది. మెట్రో నిర్వహణలో రోజుకు సుమారు రూ.కోటిన్నర వరకు నష్టం వస్తున్నట్లు ఎల్ అండ్ టీ అధికారులు చెబుతూ వస్తున్నారు. ఆశించినట్లుగా ప్రయాణికుల సంఖ్య రోజుకు 6 లక్షలకు పెరగకపోవడం, మరోవైపు నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలు తప్పడంలేదని వివరిస్తున్నారు.
Hyderabad Metro : ఉచిత బస్సు ప్రయాణంతో..
టికెట్ రేట్ల సవరణ విషయంపై హెచ్ఎంఆర్ సంస్థ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబరులో కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రజాభిప్రాయాన్ని సేకరించి నివేదిక సమర్పించింది. అదే సమయంలో 2023 జనవరి నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రావడంతో టికెట్ చార్జీల విషయాన్ని మళ్లీ ఎత్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులు ప్రయాత్నాలను ముమ్మరం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కారణంగా మెట్రోకు మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా బాగా తగ్గిందని మెట్రో అధికారులు చెబుతున్నారు. కనీసం టికెట్ చార్జీలు పెంచుకునే చాన్స్ ఇస్తే కొంతైనా నష్టాలను పూడ్చుకుంటామని ఎల్అండ్టీ భావిస్తోంది.
అయితే మెట్రో రెండో దశ నిర్మాణంపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రానికి ఈ విషయం తెలియజేస్తే… అసలు లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆలోచిస్తోంది. అంతేకాకుండా కాలుష్యరహితంగా నడిచే మెట్రో రైళ్లలో టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని, పెంచితే ప్రయాణికుల సంఖ్య పడిపోతుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటోంది.
. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..