Hyderabad : తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) లో ‘అయ్యప్ప దీక్ష’ అంశం తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధారణ కోసం నలుపు రంగు దుస్తులు ధరించడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్కు (SI) ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడం వివాదాస్పదమైంది. దీనిని నిరసిస్తూ గురువారం లక్డికాపూల్లోని డీజీపీ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన (Ayyappa Devotees Protest,)కు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అసలేం జరిగింది?
కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సబ్ ఇన్స్పెక్టర్, తాను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నానని, ఆ సమయంలో యూనిఫామ్కు బదులుగా నలుపు రంగు దుస్తులు ధరించడానికి, గడ్డం పెంచుకోవడానికి, పాదరక్షలు లేకుండా విధులకు హాజరయ్యేందుకు అనుమతి అధికారులను కోరారు. అయితే, దీనిపై స్పందించిన అదనపు డీసీపీ (ఆగ్నేయ) సదరు ఎస్సై అభ్యర్థనను తిరస్కరించారు.
పోలీసుల వాదన ఇదీ!
పోలీసు సర్వీస్ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్నప్పుడు సిబ్బంది కచ్చితంగా యూనిఫామ్ కోడ్ పాటించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. మతపరమైన దీక్షలు చేపట్టాలనుకునే సిబ్బంది సెలవు (Leave) పెట్టుకోవచ్చని, కానీ డ్యూటీలో ఉన్నప్పుడు సివిల్ డ్రెస్ లేదా మతపరమైన వేషధారణకు అనుమతి ఉండదని మెమోలో పేర్కొన్నారు.
ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం సుమారు 50 మంది భక్తులు డీజీపీ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల తీరుకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు ఉదయం సైదాబాద్లోని డీసీపీ (తూర్పు) కార్యాలయం వద్ద కూడా భక్తులు ఆందోళన చేపట్టారు. హిందూ ఆచారాలను గౌరవించాలని వారు డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







