హైదరాబాద్, మార్చి 23: దేశంలో దోపిడీ, పీడన లేని సమాజ స్థాపన కోసం విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో మరో పోరాటానికి విద్యార్థి, యువజనులు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ (AISF) మాజీ జాతీయ అధ్యక్షులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. సోమవారం నాడు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రామ్ కోఠిలోని భగత్ సింగ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
విప్లవ ధ్రువతారలు భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్
ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. బ్రిటిష్ వలస పాలన నుండి దేశాన్ని విముక్తి చేసేందుకు అనేకమంది ప్రాణత్యాగం చేశారని, అందులో చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ యువతకు నిత్య స్ఫూర్తి అని కొనియాడారు.
1907 సెప్టెంబర్ 28న జన్మించిన భగత్ సింగ్, జాతీయ భావాలు గల కుటుంబం నుండి వచ్చి దేశం కోసం బలిదానమయ్యారని గుర్తు చేశారు.
కేవలం తెల్లదొరల పాలన పోవడమే కాదు, ఒక మనిషిని మరొక మనిషి దోచుకోలేని సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థ రావాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీలో బాంబులు వేసి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని గర్జిస్తూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువతను చైతన్యపరిచిన ఘనత ఆయనదేనన్నారు.
నేటి పరిస్థితులపై విమర్శలు
భగత్ సింగ్ ఆశించిన సమాజం నేటికీ సిద్ధించలేదని శ్రీనివాస్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
“తెల్లదొరలు పోయి నల్లదొరలు వస్తే ఆ స్వాతంత్ర్యం బూటకమని భగత్ సింగ్ నాడే హెచ్చరించారు. నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ, జాతీయ విద్యా విధానం-2020 పేరుతో కాషాయీకరణ చేస్తోంది.”
రిజర్వేషన్లకు పాతర వేస్తూ, సామాన్యుడికి విద్యను దూరం చేస్తున్న పాలకులకు వ్యతిరేకంగా పోరాడటమే భగత్ సింగ్కు ఇచ్చే అసలైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్ రెహమాన్, కౌన్సిల్ సభ్యులు చైతన్య యాదవ్, సామిడి వంశీవర్ధన్ రెడ్డి, అన్వర్, ఉప్పల ఉదయ్, హరీష్, నాయకులు అరుణ్, భాను, వెంకటేష్, రంజిత్, శ్రీజ, జ్యోతి, సిద్దు తదితరులు పాల్గొన్నారు.








