Chhattisgarh Maoists Surrender | దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, అటవీ ప్రాంతంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు భారీగా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. బుధవారం (మార్చి 11) నాడు చత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏకంగా 108 మంది మావోయిస్టులు పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు.
రూ. 3.95 కోట్ల రివార్డు.. భారీగా ఆయుధాలు!
లొంగిపోయిన ఈ 108 మంది మావోయిస్టులపై ప్రభుత్వం గతంలో ప్రకటించిన రివార్డుల విలువ మొత్తం రూ. 3.95 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. బస్తర్ డివిజన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ లొంగుబాటు కార్యక్రమంలో వారు తమ వద్ద ఉన్న 101 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.
ప్రాంతాల వారీగా లొంగిపోయిన వారి వివరాలు:
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన వివిధ ప్రాంతాల నుంచి మావోయిస్టులు తరలివచ్చారు:
- బీజాపూర్: 37 మంది
- దంతేవాడ: 30 మంది
- సుక్మా: 18 మంది
- బస్తర్: 16 మంది
- నారాయణపూర్: 04 గురు
- కాంకేర్: 03 గురు
వీరిలో 44 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
Maoists | జనజీవన స్రవంతిలోకి ఎందుకు?
ప్రభుత్వాలు అడవుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, నిరంతర కూంబింగ్, పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాల వల్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పట్టు తప్పుతోంది. కఠిన జీవనం కంటే సాధారణ పౌరులుగా జీవించడమే మేలని భావించి వీరు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారని అధికారులు అభిప్రాయపడ్డారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాస పథకాల కింద అన్ని రకాల ప్రయోజనాలు కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.








