Delimitation : నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జనాభా లెక్కల ప్రాతిపాదికన పునర్విభజన చేపడితే తాము నష్టపోతామని దక్షిణ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాలుగా జనాభా నియంత్రణకు తాము కృషి చేస్తున్నామని, దీని ఆధారంగానే పునర్విభజన (Delimitation) చేపడగామంటే తమకు ప్రాతినిధ్యం తగ్గుతుందని అంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఉందని, దీని కారణంగా వాటికి ఎక్కువ నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉందని వ్యతిరేకిస్తున్నాయి.
చెన్నైలో జేఏసీ సమావేశం
నియోజకవర్గాల పునర్విభజన వల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాల సంయుక్త కార్యాచరణ కమిటీ (anti-delimitation Joint Action Council (JAC) చైన్నైలో సమావేశమైంది. మార్చి 5న జరిగిన అఖిలపక్ష సమావేశానికి కొనసాగింపుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (Tamil Nadu Chief Minister M.K. Stalin) అధ్యక్షతన దీన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ, కేరళ, కర్ణాటక, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు పలువురు ముఖ్యమైన రాజకీయ నేతలు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు.
Delimitation : పునర్విభజనపై వ్యతిరేకత ఎందుకు?
భారతదేశంలో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రతి పదేళ్లకోసారి జరుగుతోంది. జనాభా లెక్కల ఆధారంగా గతంలో దీన్ని చేపట్టే వారు. 1971 తర్వాత జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను నిలిపివేశారు. 2026లో కొత్తగా పునర్విభజనను జనాభా లెక్కల ఆధారంగానే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేశామని, ఇప్పుడు దాని ఆధారంగానే పునర్విభజన జరిగితే తమకు ప్రాతినిధ్యం తగ్గుతుందని వాదిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటరీ సీట్ల సంఖ్య తగ్గిపోతుందని, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉండటంతో వాటికి ఎక్కువ ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి.
ముఖ్యమంత్రులు ఎవరేం మాట్లాడారంటే..
సమావేశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికీ సముచిత ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని, అభివృద్ధిలో ముందంజలో రాష్ట్రాలపై ప్రభావం చూపేలా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రాంతానికీ సమాన హక్కులు ఉండాల్సిందేనన్నారు.
ఈ సమావేశాన్ని ఫెయిర్ డిలిమిటేషన్ (Fair Delimitation) జాయింట్ యాక్షన్ గ్రూప్ గా పిలవాలనే తీర్మానాన్ని స్టాలిన్ ప్రవేశపెట్టారు. కేరళ సీఎం పినరాయి విజయన్ (Kerala Chief MinisterPinarayi Vijayan Kerala) మాట్లాడుతూ దేశ సమాఖ్య వ్యవస్థ బలహీనపడేలా, కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేలా పునర్విభజన చేయడం తగదని అన్నారు. ఇది కేవలం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద సమస్య అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana Chief Minister A. Revanth Reddy) మాట్లాడుతూ జనాభా నియంత్రణ విధానాలను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిని ప్రోత్సహించాయన్నారు. కానీ దాని కారణంగా ప్రాతినిధ్యం తగ్గించడం అన్యాయమని విమర్శించారు. ఇది రాష్ట్రాల మధ్య అసమానతలు పెంచే ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. అందుకే దీని వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సమావేశంపై బీజేపీ నిరసన
ఇదే సమయంలో తమిళనాడు బీజేపీ (BJP)ఈ సమావేశానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసనలు తెలిపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ రాష్ట్ర హక్కుల గురించి చర్చించకుండా రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కేరళ నుంచి చెన్నైకు వ్యర్థాలను తీసుకురావడం, మేకడాటు డ్యామ్, కావేరి నదీ నీటి సమస్యలను ఇతర రాష్ట్రాలతో చర్చించకుండా నియోజకవర్గాల పునర్విభజనపై సమావేశం పెట్టడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







