హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, రైతులకు, సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలను చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో క్వశ్చన్ అవర్ (ప్రశ్నోత్తరాల సమయం) సందర్భంగా విద్యుత్ శాఖపై జరిగిన చర్చకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.
వ్యవసాయ కనెక్షన్ల జాతర: గణాంకాలు ఇవే..
గత ప్రభుత్వాల హయాంలో పేరుకుపోయిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తూ, విద్యుత్ శాఖ రికార్డు స్థాయిలో కనెక్షన్లు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. 2022 జనవరి నుండి 2025 డిసెంబర్ వరకు మొత్తం 3,44,462 మంది రైతులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు కల్పించారు. పెరిగిన లోడ్కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 75,686 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. గడిచిన రెండేళ్లలోనే (2024, 2025) సుమారు 2 లక్షల అదనపు కనెక్షన్లు ఇవ్వడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. మరో 9,700 మంది రైతులకు లైన్ పనులు పూర్తి కాగానే వెంటనే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యుత్ రంగంలో సరికొత్త విప్లవం: ‘విద్యుత్ అంబులెన్స్లు’
విద్యుత్ అంతరాయం కలిగితే గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను తెచ్చింది. విద్యుత్ సమస్యలపై 1912కు ఫిర్యాదు చేసిన వెంటనే ‘108’ తరహాలో విద్యుత్ అంబులెన్స్ వాహనం రంగంలోకి దిగుతుంది. ఈ వాహనంలో మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, థర్మల్ విజన్ కెమెరాలు, సేఫ్టీ గేర్ బాక్సులతో పాటు ఒక ఇంజనీర్ మరియు ఇద్దరు సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తారు.
‘ప్రజా బాట’ కార్యక్రమంలో భాగంగా అధికారులు వారానికి మూడు రోజులు పొలాల్లోనే ఉండి వంగిన స్తంభాలు, వేలాడుతున్న తీగలను సరిచేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు లేదా వైర్ల కొరత ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. సభ్యులు ఏదైనా సమస్యను లిఖితపూర్వకంగా తన దృష్టికి తెస్తే, కేవలం 24 గంటల్లోనే పరిష్కరిస్తామని సభ సాక్షిగా ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








