రూ.2కోట్ల ధాన్యం మాయం పై అనుమానాలు
Hanumakonda Paddy Scam | ఆ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భద్రంగా ఉందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. హనుమకొండ జిల్లా అగ్రంపహాడ్ శివారులోని మహాదేవ ఇండస్ట్రీస్ వేదికగా సివిల్ సప్లైస్ ధాన్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మిల్లులో ఉండాల్సిన ధాన్యంలో సుమారు రూ. 2 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం.
రికార్డుల్లో ఉన్న లెక్కలకు.. మిల్లులో ఉన్న నిల్వకు భారీ తేడా?
2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పౌరసరఫరాల శాఖ 2991.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం ఈ మిల్లుకు పంపించింది. నిబంధనల ప్రకారం.. మిల్లర్ ఆ ధాన్యాన్ని మరాడించి 2004.586 మెట్రిక్ టన్నులు అంటే 70 ఏసికెల బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. అయితే, ఇప్పటివరకు ఆ మిల్లర్ పౌరసరఫరాల శాఖకు కేవలం 12 ఏసికెల బియ్యాన్ని మాత్రమే పంపించారు. ఇంకా ప్రభుత్వానికి 58 ఏసికెల బియ్యాన్ని సదరు మిల్లర్ ప్రభుత్వానికి పెట్టాల్సి ఉంది.కానీ ఈ మిల్లులో సుమారు 20 ఏసికెల బియ్యానికి సరిపడా ధాన్యం మాయమైనట్లు మిల్లులో ఉన్న ప్రస్తుత నిల్వలను పరిశీలిస్తే స్పష్టంగా కనిపిస్తోంది.
అసలు 20 ఏసీకేలకు (ACKs) సరిపడా ధాన్యం మిల్లులో కనిపించకపోవడం వెనుక మర్మమేమిటి? రికార్డుల్లో చూపిన 2991.920 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుకు చేరిందా? లేక కేవలం కాగితాల్లోనే నిల్వలు చూపిస్తూ మిల్లర్ ప్రభుత్వాన్ని మోసం (Hanumakonda Paddy Scam) చేస్తున్నాడా? ఒకవేళ ధాన్యం మిల్లుకు చేరితే మరి ధాన్యం నిల్వల్లో భారీ తేడా ఎందుకు కనిపిస్తుందనేది మహదేవ ఇండస్ట్రీ యజమాన్యానికే తెలియాలి.ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి, మిల్లులోని నిల్వలను తనిఖీ చేసి వాస్తవాలను బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








