Drunken Driving Cases Hyderabad : సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లో భాగంగా వారంతం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 305 మందిని గుర్తించి అరెస్టు చేశారు. మొత్తం 305 మంది మందుబాబుల్లో 242 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది త్రిచక్ర వాహన డ్రైవర్లు, 47 మంది నాలుగు చక్రాల వాహన డ్రైవర్లు ఉన్నారు. 280 మందిలో బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ (BAC) స్థాయిలు 35 mg/100 ml నుంచి 200 mg/100 ml వరకు ఉన్నాయి, అయితే 22 మంది నిందితుల్లో 201 mg/100 ml నుండి 300 mg/100 ml వరకు BAC స్థాయిలు, ముగ్గురు నేరస్థులలో 301 mg/100 ml నుండి 500 mg/100 ml వరకు BAC స్థాయిలు ఉన్నాయి.
Drunken Driving Cases : గరిష్టంగా పదేళ్ల జైలు
అరెస్టయినవారిని కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు (Cyberabad Pollice) పునరుద్ఘాటించారు. “ఎవరైనా మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రాణాంతక ప్రమాదానికి కారణమైతే, అటువంటి వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత-2023 లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేయబడుతుంది. ఈ సెక్షన్ కింద గరిష్ట శిక్ష 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది” అని పోలీసులు తెలిపారు. పౌరులు బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, అందరికీ రోడ్డు భద్రత కల్పించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.







