- ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఘరానా ముఠా అరెస్టు..
- రూ. 50 లక్షలకు పైగా దోపిడీ
- ముఠాలోని ఐదుగురి సభ్యుల అరెస్టు
Fake ACB DSP Arrest | వరంగల్ : ఏసీబీ డీఎస్పీగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను బెదిరించి, భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఒక ఘరానా మోసగాడితో సహా ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ముఠాలో మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యుల నుంచి పోలీసులు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన రాచంపల్లి శ్రీనివాస్ (Rachampalli Srinivas) అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు (45) ఉన్నాడు. అతనికి సహకరించిన నలుగురు వ్యక్తులు (నవీన్ JR, మంగళ రవీందర్, మురళి, N. ప్రసన్న) కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా మరో ముగ్గురు నిందితులు సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ ఉన్నారు.
మోసానికి పాల్పడిన విధానం ఇదీ..
ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ శాఖలలో ఉన్నత పదవులో పనిచేస్తున్నప్రభుత్వ అధికారులతో పాటు పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకోని వారికి ఏసీబీ డీఎస్పీనంటూ ఫోన్ చేసి “మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, కేసు నమోదు చేశాం. ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవాల్సి వుంటుంది” అని బెదింపులకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు వరంగల్ జిల్లా రోడ్డు రవాణా శాఖలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి ఏసీబీ డీఎస్పీ అంటూ బెదిరించి సుమారు 9 లక్షల 96 వేల రూపాయలను వివిధ మార్గాల్లో దోచేశాడు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోని ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ ను, అతడికి సహకరించిన మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.
నిందితుడి పాత నేరాల చిట్టా
ప్రధాన నిందితుడున శ్రీనివాసులును పోలీసులు విచారించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో 2002లో మొదట ద్విచక్ర వాహనం చోరీతో దొంగతనాలకు శ్రీకారం చూట్టాడు. మరో కొద్ది రోజులు నిందితుడు నకిలీ పోలీస్ అధికారిగా అవతారమెత్తి రాయలసీమ ప్రాంతంలో జరిగిన పలు చోరీల్లో అరెస్టు అయిన నిందితుల కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసుకొని వారి వద్ద దొంగ సొత్తు దాచి ఉంచారని బెదిరించి వారి నుంచి బంగారం, డబ్బు దోపిడీకి పాల్పడటంతో సుమారు 50 కేసుల్లో నిందితుడుని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలులో నిందితుడు తన వ్యవహర శైలిని మార్చుకోకుండా జైలు నుంచి విడుదలైన అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు, రాయలసీమ ప్రాంతాల్లో 41కి పైగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడటం తో పోలీసులు మరోమారు నిందితుడి అరెస్టు చేసి జైలుకు తరలించారు .
నిందితుడు జైలు నుంచి విడుదలైన అనంతరం మళ్లీ సులభంగా డబ్బును సంపాదించాలనే లక్ష్యంగా నకిలీ ఏసీబీ డీఎస్పీగా అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ ఇప్పటివరకు ఇతనిపై మొత్తం 19 కేసులు నమోదై సుమారు రూ.50 లక్షలు పైగా దోపిడీకి పాల్పడ్డారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 9 నేరాలు, ఆంధ్ర రాష్ట్రంలో 10 నేరాలకు పాల్పడ్డాడు. ఇందులో 8 కేసుల్లో అరెస్ట్ కాగా, మిగిలిన 11 కేసుల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో మిల్స్ కాలనీతో పాటు 2021 సంవత్సరంలో స్టేషన్ ఘన్పూర్ అలాగే కరీంనగర్, హైదరాబాద్, రాచకొండ, రామగుండం, వికారాబాద్, జగిత్యాల, వనపర్తి లతో పాటు ఆంధ్రాలోని కర్నూల్ జిల్లాలో జరిగిన 02 నేరాలలో అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతూ దోచేసిన డబ్బును నిందితుడు ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి విచారణలో ఉన్న మిగితా నిందితులతో పాటు, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులతో కలసి ఆన్లైన్ బెట్టింగ్, గోవాలో కాసినోలలో జూదం ఆడటంతో పాటు గోవా, బెంగుళూరు ప్రాంతాల్లో వ్యభిచార గృహాల్లో ఖర్చు చేసేవాడని పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు.
ఘరానా మోసగాడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి డి.కవిత, వరంగల్ ఎసిపి ఎన్. శుబం ప్రకాష్ ఐపిఎస్, టాస్క్ఫోర్స్, ఎసిపి ఏ.మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఎల్.పవన్ కుమార్, కె.శ్రీధర్, ఎల్. మంగిలాల్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బి. రమేష్, ఎస్ఐలు ఎస్.మహేష్, ఎం. సురేష్, టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పి.ఎస్. సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







