Delhi Blast Case | దిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి బయటపడిన ఫరీదాబాద్ వైట్ కాలర్ టెరర్ మాడ్యూల్ కేసులో దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. టెర్రర్ మాడ్యూల్ సభ్యులు అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని మౌల్వీ ఇష్తియాక్ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇష్తియాక్ మాత్రం అరెస్టయిన ఉగ్రవాదులు తనకు బకాయిగా ఉన్న అద్దె ఇవ్వాలని పదే పదే కోరడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తీవ్రతగల కేసు ఉన్నప్పటికీ, ఆయనకు కేవలం కిరాయి అంశమే ముఖ్యమైందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ను అరెస్టు చేసి విచారించినప్పుడు మొదటిసారిగా ఇష్తియాక్ పేరు బయటపడింది. ముజమ్మిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఫరీదాబాద్లోని అద్దె ఇంటిపై దాడి చేసి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలకు సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటి యజమాని, హర్యాణా మేవాత్కు చెందిన ఇష్తియాక్ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అతడు తెలిపిన ప్రకారం.. ముజమ్మిల్, ఉమర్ ఈ ఏడాది ప్రారంభంలో తనను సంప్రదించి, “ఎరువుల సామగ్రి” పేరుతో కొన్ని పదార్థాలను ఇంట్లో నిల్వ చేయాలని కోరారని, ప్రతి నెల రూ.2,500 అద్దె ఇస్తామని చెప్పారని వెల్లడించారు. అయితే దర్యాప్తు అధికారులు చెబుతున్నదాని ప్రకారం.. ఇష్తియాక్కు కేసు తీవ్రత గురించి పెద్దగా అర్థం కాలేదు. ఆరుగాలం పేదరికంతో కుటుంబాన్ని పోషించేందుకు ఇబ్బంది పడుతున్న అతడికి అద్దె బకాయిలే ప్రధాన సమస్యగా మారాయి. పెండింగ్ అద్దె వస్తే ఇంటికి పంపాలని అతను పదేపదే కోరుతున్నాడని తెలిసింది. ఈ కేసు మరిన్ని కోణాల్లో విచారించేందుకు ఆయనను ఇప్పుడు జమ్మూ–కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించారు.







