fire accident : కరీంనగర్లోని శాతవాహహన యూనివర్సిటీ (Satavahana University)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ఈ మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఏ కారణంతో చెలరేగాయి అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అయితే మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వ్యాపించడంతో రికార్డు రూమ్లోని విలువైన పత్రాలు, ప్రశ్నాపత్రాలు, ఇతర ముఖ్యమైన డిక్యుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యూనివర్సిటీ అధికారులు (university authorities) అత్యవసరంగా రికార్డులను (important records) ఇతర గదులకు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మంటలు గదులను చుట్టేశాయి. దీంతో పత్రాలన్నీ కాలిపోయాయి.
ముమ్మరంగా సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు యూనివర్సిటీకు చేరుకున్నారు. వెంటనే రెండు ఫైరింజన్ల (two fire engines)ను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తెచ్చే పనిలో పడ్డారు. వారి వేగవంతమైన స్పందన వల్ల మరిన్ని గదులకు మంటలు వ్యాపించకుండా నివారించగలిగారు.
fire accident : నిన్న కూడా చెలరేగిన మంటలు
గురువారం రోజు కూడా యూనివర్సిటీలోనే అడవికి దగ్గర ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు కామర్స్ బ్లాక్, బాయ్స్ హాస్టల్, హెల్త్ సెంటర్ వరకు వ్యాపించాయి. అప్పుడు కూడా అగ్నిమాపక బృందం నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించి ఆ మంటలను అదుపు చేసింది. ఆ సమయంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో కరీంనగర్, మానకొండూర్ ఫైర్ స్టేషన్ల నుంచి రెండు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. వాళ్ల కృషితో మంటలను పూర్తిగా అదుపు చేయగలిగారు. అయితే.. ఈ రెండు ఘటనలు రెండు రోజుల వ్యవధిలోనే జరిగిపోవడంతో యూనివర్సిటీలో భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తరచూ ఇదేనా?
ఇటీవలి కాలంలో యూనివర్సిటీలో తరచూ మంటలు చెలరేగుతున్నాయి. ఇదంతా యాధృచ్ఛికమా? లేక ఉద్దేశపూర్వకంగా చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పరీక్షల సమయం దగ్గరపడుతుండటంతో కొన్ని శక్తులు కావాలనే ప్రశ్నాపత్రాలను నాశనం చేయాలనే కుట్రలో భాగంగా ఇలా చేస్తున్నాయా? అన్న దానిపై విచారణ అవసరం ఉంది.
విద్యార్థుల్లో భయాందోళన
యూనివర్సిటీలో అడవి ప్రాంతానికి దగ్గరగా వున్న నిర్మాణాలు, విద్యార్థుల వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాలు ఇవన్నీ మంటలకు గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయడం, రెగ్యులర్గా భద్రతా తనిఖీలు చేయడం అవసరమని అంటున్నారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదంపై యూనివర్సిటీ యాజమాన్యం, జిల్లా అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాలని విద్యార్థుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఒక ప్రమాదం మాత్రమే కాదని, విద్యార్థుల భవిష్యత్తును బుగ్గిపాలు చేసిన ఘటన అని అంటున్నాయి.