Telangana Highways | రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను హ్యామ్ (HAM )విధానంలో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమితిచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.25,661 కోట్ల నిధులను జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 431 కిలోమీటర్ల మేర రహదారులను హ్యామ్ పద్దతిలో నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ రహదారులను కేంద్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు 40:60 నిష్పత్తిలో నిధులు ఖర్చును పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో 124 జాతీయ రహదారులను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. రూ.3,45,466 కోట్లతో 6,376 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించనున్నారు. రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసి చేపట్టే ఈ రహదారుల నిర్మాణాల తాత్కాలిక జాబితాలో రాష్ట్రానికి చెందిన ఐదు జాతీయ రహదారులకు చోటు దక్కడం విశేషం.
Telangana Highways : రాష్ట్రానికి లభించిన ప్రధాన ప్రాజెక్టులు:
ఆర్మూర్ – జగిత్యాల – మంచిర్యాల్ కారిడార్:
68 కిలోమీటర్ల రహదారి విస్తరణకు ₹2,550 కోట్లు.
ఆర్మూర్ – జగిత్యాల జాతీయ రహదారి:
64 కిలోమీటర్ల కొత్త రహదారి నిర్మాణానికి ₹2,338 కోట్లు.
జగిత్యాల – కరీంనగర్ జాతీయ రహదారి:
59 కిలోమీటర్ల విస్తరణకు ₹2,384 కోట్లు.
మహబూబ్నగర్ – రాయచూర్ ఎస్హెచ్ 167:
80 కిలోమీటర్ల రహదారిని ఫోర్ లైన్గా విస్తరించేందుకు ₹2,662 కోట్లు.
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (RRR):
160 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి భారీగా ₹15,627 కోట్ల నిధులు మంజూరు.
ఆర్మూర్ – జగిత్యాల, జగిత్యాల-మంచిర్యాల్ కారిడార్లో భాగమైన జాతీయ రహదారిని నాలుగు లైన్లకు విస్తరించనున్నారు. అంతే కాకుండా జగిత్యాల- కరీంనగర్ మధ్యలో కూడా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ ట్రిపుల్ ఆర్, హైదరాబాద్-పనాజీ సెక్షన్ పరిధిలోని మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ ఎస్హెచ్ 167 రహదారి పనులు చేపట్టేందుకు మొత్తం రూ.25.661 కోట్ల నిధులను మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ HAM రహదారుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు 160 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.15,627 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనిని జాతీయ రహదారిగా గుర్తించి ఎన్.హెచ్ 161 ఏఏ నెంబరును కూడా ఖరారు చేసింది. హైదరాబాద్ పనాజీ సెక్షన్ పరిధిలోని మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ ఎన్.హెచ్ 167 వెళ్లే రహదారి, మహబూబ్ నగర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని గుడెబల్లూర్ (రాయచూరుకు సమీపంలో) వరకు ఉన్న 80 కి.మీ డబుల్ రోడ్డును రూ.2,662 కోట్ల అంచనాలతో ఫోర్ లైన్గా విస్తరించనున్నారు. జగిత్యాల-మంచిర్యాల్ జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.2,550 కోట్ల వ్యయంతో 68 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టనున్నారు. ఆర్మూర్ (Armoor) – జగిత్యాల 64కిలోమీటర్ల జాతీయరహదారి నిర్మాణానికి రూ.2,338కోట్లు మంజూరు చేశారు. జగిత్యాల కరీంనగర్ 59కిలోమీటర్ల జాతీయరహదారి నిర్మాణ పనులకు రూ.2,384కోట్లు మంజూరు చేశారు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    