Harish Rao | కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేస్తుండడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు.. రాక్షస పాలన అని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు హరీశ్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా..? ఎమర్జెన్సీ పాలనా..? అని సీఎం రేవంత రెడ్డిని నిలదీశారు హరీశ్రావు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళితే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తిరిగి కేసు బనాయించారని, ఉదయాన్నే పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి అక్రమగా అరెస్టు చేసేందుకు యత్నించారని ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, తనపై, బీఆర్ఎస్ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు. అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు చేస్తున్నారు.. మళ్లీ ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్లం కాదన్నారు. తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై హరీశ్రావు నిప్పులు చెరిగారు.
ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులా..? కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి, ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) ఎక్స్ వేదికగా రేవంత్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.