Food Poisoning | హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే ఆయా పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజనం నమూనాలను ల్యాబ్ల కు పంపించాలని ఆదేశించింది. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన హైకోర్టు.. ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోతే మాత్రం స్పందించరా అని ప్రశ్నించింది. అధికారులకు కూడా పిల్లలు ఉన్నారని.. మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అధికారులకు తలంటింది.
ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోకపోవడంపై కోర్టు ప్రభుత్వాన్ని కూడా నిలదీసింది. ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని వొచ్చే సోమవారంలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారం రోజుల వ్యవధిలో ఇదే పాఠశాలలో రెండోసారి ఫుడ్ పాయిజనింగ్ ఘటన జరగడం తీవ్రమైన అంశమని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాస్రావుతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఘటనలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులు బయటి నుంచి కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారిని మాగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారం రోజుల వ్యవధిలో ఇదే పాఠశాలలో ఇది రెండో ఘటన. నవంబర్ 20న మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
తొలి ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి సీరియస్గా స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయడంతోపాటు మధ్యాహ్న భోజనం సరఫరా చేసేందుకు ఓ ఏజెన్సీకి ఇచ్చిన కాంట్రాక్టును కూడా రద్దు చేశారు.అయితే అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ మరోమారు ఫుడ్ పాయిజన్ ఘటనతో పాఠశాల ఉలిక్కిపడింది. ఈ సంఘటనపై నిరసనలు జరుగుతాయని భావించి పోలీసులు పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.
ఇదిలా ఉండగా ఫుడ్ పాయిజనింగ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన దాదాపు నెల రోజుల తర్వాత, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో 16 ఏళ్ల విద్యార్థి సోమవారం మరణించిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో అక్టోబర్ 30న అస్వస్థతకు గురైన 60 మంది విద్యార్థుల్లో సి.శైలజ ఒకరు. ఆ విద్యార్థిని మృతికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, ఆమె కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) డిమాండ్ చేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ప్రతినెలా రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) వల్ల ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారనిఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ వల్ల 42 మంది విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ నాయకురాలు కె.కవిత ఆరోపించారు.
One thought on “Food Poisoning | స్కూళ్లలో ఫుడ్పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్”