kaleshwaram project | మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (Former CM KCR), నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్రావుకు (Former Minister Harish Rao) హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు వీరికి ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను జనవరి 7న వాయిదా వేసింది. పిటిషనర్కు నోటీసులు జారీ చేసింది.
ఆరోపణలు ఏమిటంటే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేసుకున్న కాళేశ్వరంలో ప్రాజెక్టు (kaleshwaram project ) నిర్మాణంలో పారదర్శకత లోపించిందని, అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు వచ్చాయి. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగిపోయింది. రేవంత్రెడ్డి నేతృత్వంలో కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే ఇది చోటుచేసుకుంది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జలసౌధలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. పలు దఫాలుగా కాళేశ్వరం పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలు మొత్తం 12 చోట్లా జరిగాయి.
రేవంత్రెడ్డి తీవ్ర ఆరోపణలు
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై న్యాయవిచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగిన పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. నిర్మాణ సమయంలో, ఆ తర్వాత గోప్యతను పాటించారని, రహస్య జీవోలు జారీ చేశారని అన్నారు. భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో అవినీతి చోటుచేసుకుందని, దీనికి లోబడి నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు. రూ.4600 కోట్ల ఖర్చుతో భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటే దీనికి నిదర్శనమని ఆరోపించారు.
పవర్ పాయింట్ ద్వారా..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కుంభకోణం (Scam) జరిగిందని ఆరోపిస్తున్న క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల బృందం సందర్శించింది. కుంగుబాటుకు గురైన పిల్లర్లను పరిశీలించింది. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చి, ఈ అక్రమాలు ఎలా జరిగాయో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడియాకు వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది. మాజీ మంత్రి కేటీఆర్ సహా ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యటించారు. రేవంత్ సర్కారు తమపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కొన్ని లోపాల వల్లే బ్యారేజీ స్వల్పంగా కుంగిందని, అంతే గానీ.. పూర్తిగా ఇది నిరుపయోగంగా మారలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు చేయడం కాదని, నిరూపించి చూపాలని రేవంత్ సర్కారుకు కేటీఆర్ సవాల్ విసిరారు.
భూపాలపల్లి కోర్టులో పిటిషన్
మేడిగడ్డ కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ మధ్య వాగ్యుద్ధం జరుగుతుండటం, విజిలెన్స్ విచారణ కొనసాగుతుండటం లాంటి పరిణామాల క్రమంలోనే రాజలింగం అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమంటూ పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్తోపాటు ఉన్నత అధికారులను ప్రతివాదులుగా పేర్కొంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో జూలై 10న కోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరుకావాలంటూ కేసీఆర్, హరీశ్రావులను ఆదేశించింది.
భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కేసీఆర్, హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఈ రోజు (మంగళవారం) విచారించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్, హరీశ్రావుకు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







