Kerala Sharon Raj murder case : కేరళలో మూడేళ్ల క్రితం చోటు చేసుకున్న హత్య కేసులో తీర్పు వెలువడింది. ప్రియుడిని అంతం చేసిన ప్రియురాలికి ఉరి శిక్ష ఖరారైంది. తిరువనంతపురం నెయ్యట్టికార అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.బషీర్ ఈరోజు తీర్పును వెలువరించారు. ప్రియుడు షరోన్రాజ్ను హత్య చేసిన గ్రీష్మకు ఉరిశిక్ష విధించారు. మరో ప్రధాన నిందితుడైన ఆమె మేనమామ నిర్మల్ కుమారన్కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది.
ముందు ప్రేమ.. ఆ తర్వాత పగ
షరోన్ రాజ్ బీఎస్సీ రేడియాలజీ చదువుకుంటున్నప్పుడు గ్రీష్మతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య ఏడాది పాటు రిలేషన్షిప్ కొనసాగింది. అయితే.. గ్రీష్మ కుటుంబం వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో బ్రేకప్ చేసుకుందామని గ్రీష్మ కోరగా షరోన్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో తన తల్లి, మేనమామ సహకారంతో అతడిని హత్య చేసేందుకు గ్రీష్మ పథకం పన్నింది.
హత్యకు కుట్ర ఎలా జరిగింది?
షరోన్ను గ్రీష్మ 2022 అక్టోబర్ 14న తన ఇంటికి ఆహ్వానించింది. నువ్వొస్తే పెద్దలను ఒప్పిద్దామని నమ్మించింది. దీంతో గ్రీష్మ ఇంటికి వెళ్లాడు షరోన్. అతడు రాగానే గ్రీష్మతోపాటు ఆమె తల్లి, మేనమామ మొదట కూల్డ్రింక్ ఇచ్చారు. ఆ తర్వాత విషం కలిపిన ఆయుర్వేద మందు ఇచ్చారు. ఇది తాగిన మరుసటి రోజు షరోన్ మృతి చెందాడు. విష ప్రభావం వల్ల షరోన్ శరీర అంతర్భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మరణం సంభవించిందని డాక్టర్లు నిర్ధారించారు.
Sharon Raj murder case : లోతైన విచారణ
షరోన్ హత్యోదంతం వెలుగులోకి రావడంతో తీవ్ర నిరసనలు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ జాన్సన్ నేతృత్వంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. గ్రీష్మ ఇంటికి వెళ్లిన తర్వాతే షరోన్ అనారోగ్యానికి గురైనందున ఆమె కుటుంబంపై అనుమానం కలిగింది. అక్టోబరు 31న గ్రీష్మ, ఆమె మేనమామ నిర్మల్, తల్లిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో సెక్షన్లు 364 (కిడ్నాప్), 328 (విషం ఇవ్వడం), 201 (తప్పుదారి పట్టించడం) కింద కేసులు నమోదు చేశారు. ఈ హత్య ఘటన కేరళలో పెను కలకలం సృష్టించింది.
కుప్పకూలిపోయిన గ్రీష్మ
షరోన్ హత్య కేసు (Sharon Raj murder case) లో కొద్ది రోజుల ముందే కోర్టులో వాదోపవాదాలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి ఈ రోజు తీర్పును వెలువరిస్తూ గ్రీష్మకు మరణశిక్షను ఖరారు చేశారు. ఆమె మేనమామకు మూడు సంవత్సరాల కఠిన శిక్ష విధించించారు. తీర్పు విన్న వెంటనే గ్రీష్మ కోర్టులోనే కుప్పకూలి కన్నీరు మున్నీరైంది. ఇదే ఘటనలో గ్రీష్మ తల్లి మీద కూడా కేసు నమోదైనా, ఆమె ప్రమేయానికి సరైన సాక్షాలు లభించలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..