ఇసుక మాఫియా కోసం చెక్డ్యామ్లపై డైనమైట్లు – ప్రభుత్వ కనుసన్నల్లోనే విధ్వంసం
హైదరాబాద్ : తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు, పక్కా మాఫియా పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇసుక మాఫియా లాభాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన చెక్డ్యామ్లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాత ‘వాటర్మ్యాన్’ రాజేంద్ర సింగ్ దీనిని మానవ నిర్మిత విధ్వంసంగా పేర్కొన్నా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టూ లేదని విమర్శించారు. డ్రిల్లింగ్ మెషీన్లతో రంధ్రాలు చేసి, జెలటిన్ స్టిక్స్తో పేల్చినట్లు సాక్ష్యాలతో నిరూపించారని తెలిపారు.
భూగర్భ జలాలు పెంచేందుకు చెక్డ్యామ్లు నిర్మిస్తే, వాటిని కూల్చి రైతుల పొలాలను ఎడారులుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం కాదని, గ్యాంగ్స్టర్ల అడ్డా అని నిలదీశారు.
ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయని కాంగ్రెస్ మంత్రులు చెబుతున్న అబద్ధాలకు రాజేంద్ర సింగ్ నివేదిక చెంపపెట్టులాంటిదని అన్నారు. ఇసుక మాఫియా వెనుక ఉన్న అసలు దొంగలను బయటపెట్టాలని, పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ బాంబుల సెగ కుర్చీ దాకా చేరుతుందని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







