Kumbh Mela 2025 | మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. హైదరాబాద్ ఏడో నిజాం (VII Nizam of Hyderabad). మహా కుంభామేళాలో భక్తులకు ఆయన ఎనలేని సేవలు అందించారు. భక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అక్కడ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 1942 నాటి విషయం ఇది. ఆ సమయంలో ప్రయాగ్ (ప్రస్తుత ప్రయాగ్రాజ్) నగరంలో జరిగిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali Khan) సేవలు అందించారు. కుంభామేళా (Kumbh Mela) లలో లక్షలాది మంది భక్తులు హాజరు కాగా నిజాం ఆయుర్వేదిక్ సఫారీ దవాఖానా (Nizam Ayurvedic Mobile Clinic) అనే చికిత్సాలయాన్ని నిజాం రాజు ఏర్పాటు చేశారు. ఎస్.ఎ.హుస్సేన్, వినోద్ కుమార్ భట్నాగర్ అనే పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. వీరు జాతీయ భారతీయ వైద్య వారసత్వ సంస్థ (NIIMH)కు చెందిన పరిశోధకులు.
Kumbh Mela : నిజాం క్లినిక్ ఏర్పాటుకు కారణాలు?
ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభామేళాలో వేలాది మంది భక్తులు గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి చేరుకుంటారు. ఇంత భారీ సంఖ్యలో జనం రావడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. దీంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ ప్రత్యేక ఆయుర్వేద క్లినిక్ను ఏర్పాటు చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా భక్తులకు వైద్య సేవలు అందించడమే కాకుండా ఆయుర్వేద వైద్య విధానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడమే మీర్ ఉస్మాన్ అలీ ముఖ్యోద్దేశం. భారతదేశ సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదానికి గొప్ప చరిత్ర ఉంది. దీనిని మరింత ప్రోత్సహించేందుకు నిజాం సర్కారు అప్పట్లో నడుం కట్టారు.
అనుభవజ్ఞునులైన వైద్యుల సేవలు
నిజాం రాజు ఏర్పాటు చేసిన క్లినిక్లో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు పనిచేశారు. వీరిలో డాక్టర్ పండిట్ రాధాకృష్ణ, ఎం.ఎ.రంగాచారి ముఖ్యులు. వీరిద్దరి నేతృత్వంలో హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక వైద్య బృందం కుంభామేళా (Kumbh Mela 2025) కు తరలివెళ్లింది. 1941 డిసెంబర్ 26న హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఈ టీం ప్రయాగ్ నగరానికి చేరుకొని 1932 జనవరి 1న తమ సేవలను ప్రారంభించింది. అయితే, అధికారికంగా ఈ క్లినిక్ను జనవరి 6న ప్రారంభించారు.
ఎలాంటి చర్యలు చేపట్టారంటే..
ఈ క్లినిక్లో భక్తులకు విభిన్న రకాల వైద్య సేవలు అందించారు. అప్పట్లో జనసమ్మర్థం వల్ల కొన్ని వ్యాధులు త్వరగా వ్యాపించే ప్రమాదం ఉండేది. ఆయుర్వేద మందుల ద్వారా వాటిని నివారించేందుకు ప్రయత్నించారు. భక్తులకు ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి గురించి అవగాహన కల్పించారు. నీటి కాలుష్యం, ఆహార విషజ్వరాలను నివారించేందుకు చర్యలు తీసుకున్నారు.
వైద్య రంగానికి నిజాం చేసిన సేవలు
నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆరోగ్య సంరక్షణను అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఆయన ప్రతిఏటా రూ. 35 వేలు కేటాయించే వారు. ఆయన ఈ నిధులను ఆయుర్వేద కేంద్రాల అభివృద్ధి కోసం ఉపయోగించేవారు. కేవలం ఆయుర్వేదమే కాకుండా, యునాని, అల్లోపతి, హోమియోపతి వంటి ఇతర వైద్య విధానాలకు కూడా మీర్ ఉస్మాన్ అలీ ప్రాధాన్యం ఇచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..