మేడారం: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మ మహాజాతర–2026 (Medaram Jatara 2026) కు ములుగు జిల్లా మేడారం సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరగనున్న ఈ మహా వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మంత్రి సీతక్క మేడారంలోనే బస చేస్తూ, ప్రతి విభాగాన్ని నిశితంగా సమీక్షిస్తున్నారు.
జాతరను సమర్థంగా నిర్వహించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించారు. 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులతో పాటు, 2,000 మంది ఆదివాసీ యువ వాలంటీర్లు సేవలందిస్తున్నారు.నెట్వర్క్ సమస్యలు తలెత్తకుండా 60 మొబైల్ టవర్లు (27 శాశ్వత, 33 తాత్కాలిక), 450 VHF సెట్లను ఏర్పాటు చేశారు.
మేడారం జాతర 2026 – గణంకాలు
| అంశం | వివరాలు |
| భక్తుల అంచనా | సుమారు 3 కోట్లు |
| విధుల్లో సిబ్బంది | 42,027 మంది |
| ఆర్టీసీ బస్సులు | 4,000 (51,000 ట్రిప్పులు) |
| మొబైల్ టవర్లు | 60 (శాశ్వత + తాత్కాలిక) |
| టాయిలెట్లు | 5,700 |
| వైద్య సిబ్బంది | 5,192 మంది |
| తాగునీటి నల్లాలు | 5,482 |
రవాణా, పార్కింగ్: గంటకు 15 బస్సులు!
భక్తుల రాకపోకల కోసం టీజీఆర్టీసీ (TGSRTC) భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 4000 బస్సులు – 51,000 ట్రిప్పులు: భక్తుల రద్దీని బట్టి గంటకు 15 బస్సులు నడిపేలా ప్లాన్ చేశారు. పార్కింగ్: 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ జోన్లను సిద్ధం చేశారు. 525 చోట్ల రహదారి మరమ్మతులు పూర్తి చేశారు.
తాగునీరు, పారిశుధ్యం : మిషన్ భగీరథ: 5,482 నల్లాల ద్వారా నిరంతర శుద్ధ జలాలను సరఫరా చేస్తున్నారు. 5,700 టాయిలెట్లు సిద్ధం చేశారు. 5,000 మంది సిబ్బంది, 150 ట్యాంకర్లు, స్వీపింగ్ మెషీన్లతో నిరంతరం శుభ్రత పనులు జరుగుతాయి. జంపన్నవాగు వద్ద స్నానాలు చేసే భక్తుల కోసం 119 డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు చేశారు.
వైద్యం మరియు భద్రత : అత్యవసర వైద్యం: 30 అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు, 50 పడకల ఆసుపత్రి మరియు రోజుకు 30 మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంటాయి. : జంపన్నవాగులో 210 మంది గజ ఈతగాళ్లు, 100 SDRF బృందాలు నిరంతరం పహారా కాస్తాయి. 196 ట్రాన్స్ఫార్మర్లు, 28 డీజిల్ జనరేటర్లతో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు.







