తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case ) సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ నాయకులు, ముఖ్య పార్టీల నేతలు, అనుచరుల ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసినట్టు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ (SIT Investigation) చేస్తుండగా తాజా సమాచారం ప్రకారం 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడైంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు, వ్యక్తులు ఎన్నికల పక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో 4,200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) పై ఆరోపణలు వచ్చాయి. 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ మధ్యలోనే కనీసం 618 మంది నేతల ఫోన్లను ట్యాప్ చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇందులో తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్కు చెందిన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, కోటింరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి వంటి నాయకుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ట్యాప్ చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్తో పాటు కాంగ్రెస్, బీజేపీ సహా అనేక పార్టీల కీలక నేతలు, అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ లక్ష్యంగా మారాయి. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. నిన్న ఒక్కరోజే తొమ్మిది మంది సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేశారు. అందులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య, గాంధీ భవన్కు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారు.
ఇవన్నీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన ఆధారాలతో వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు పీసీసీ అధికార ప్రతినిధి జయపాల్ రెడ్డి సిట్ ముందు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విధంగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కూడా విచారించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.