Karimnagar Murder Planned killing : అప్పులు తీర్చుకోవడానికి ఓ తమ్ముడు దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు. రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్న(Elder Brother)నే పొట్టన పెట్టుకున్నాడు. మానసిక వైకల్యం (Mentally Challenged)తో ఉన్నాడనే కనకరం కూడా లేకుండా పక్కా ప్లాన్ ప్రకారం (planned killing) మరో ఇద్దరితో కలిసి హత్య చేశాడు. కరీంనగర్ జిల్లా (Karimnagar district) రామడుగు మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
వ్యాపార నష్టాలు.. పెరిగిన అప్పులు
నిందితుడు మామిడి నరేష్ మూడేళ్ల క్రితం రెండు టిప్పర్లు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతున్నాడు. ఈ క్రమంలో వ్యాపారంలో వరుస నష్టాలు వచ్చాయి. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఒకవైపు వ్యాపారం సరిగా నడవకపోవడం, మరోవైపు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో నరేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్న నరేష్కు చివరకు ఓ దుర్మార్గమైన ఆలోచన తట్టింది. పక్కా ప్లాన్ ప్రకారం మానసిక వైకల్యంతో ఉన్న అన్న వెంకటేష్ (37) పేరుతో రూ. 4.14 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ (Insurance) పాలసీలు తీసుకున్నాడు. తర్వాత ఆ బీమా మొత్తాన్ని పొందడానికి స్కెచ్ వేశాడు. ఇందుకు ఇద్దరి సహకారం తీసుకున్నాడు. అప్పటికే తాను అప్పు తీసుకున్న రాకేష్ అని వ్యక్తితోపాటు టిప్పర్ డ్రైవర్ అయిన ప్రదీప్ను కలుపుకున్నాడు. తనకు సహకరిస్తే అప్పుగా ఇవ్వాల్సిన రూ. 7 లక్షలకు అదనంగా రూ.13 లక్షలు ఇస్తానని రాకేష్కు, రూ. 2 లక్షలు ఇస్తానని ప్రదీప్కు ఆశ చూపి అన్న వెంకటేష్ హత్యకు కుట్రపన్నాడు.
Planned killing : టిప్పర్ చెడిపోయిందని చెప్పి…
ప్లాన్లో భాగంగా ఇంటి వద్ద ఉన్న వెంకటేష్ వద్దకు ప్రదీప్ వెళ్లాడు. తన టిప్పర్ చెడిపోయిందని చెప్పి అతడిని గ్రామ శివార్లకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక టిప్పర్ కింద పడుకొని ఏమైందో చూడు అని చెప్పాడు. అమాయకుడైన వెంకటేష్ టిప్పర్ కింద పడుకోగానే తమ్ముడు (Younger brother) నరేష్ దానిని ముందుకు నడిపి అన్నను టైర్ల కింద నలిపి హత్య చేశాడు. దీనిని రోడ్డు యాక్సిడెంట్గా చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీన్నంతటికీ రాకేష్ తోడుగా ఉండి నరేష్కు సహకరిస్తూ పోయాడు. పోలీసులకు ఫిర్యాదు సమయంలోనూ నరేష్కు తోడుగా ఉన్నాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇది రోడ్డు ప్రమాదం కేసుగా నమోదు చేసుకున్నారు.
ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమయంలో అనుమానాలు
ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం నరేష్ అప్లయ్ చేయగా బీమా కంపెనీ ప్రతినిధులకు పలు అనుమానులు వ్యక్తమయ్యాయి. అవి నివృత్తి కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే సొంత తమ్ముడే అమాయకుడైన అన్నను నరేష్ మరో ఇద్దరితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడని వెల్లడైంది. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







