పాకిస్తాన్తో చర్చలు అంటే పీవోకే, ఉగ్రవాదంపైనే
PM Modi | పాకిస్తాన్ కాచుకో.. ఇకపై ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నామరూపాల్లేకుండా చేస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగానే పక్కన పెట్టామని, ఇంకా పూర్తిగా ఆపేయలేదని, ఎలాంటి టెర్రర్ అటాక్ జరిగినా ఇక దానిని యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ భూభాగంలో టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశామని ప్రకటించారు. అలాగే మన సత్తా ఏమిటో ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్థాన్కు చాటాని తెలిపారు. ఈ క్రమంలో భారత సైనిక దళాలకు పీఎం మోదీ సెల్యూట్ చేశారు.
పాక్తో చర్చలంటూ జరిగితే… టెర్రరిజం, ఆక్రమిత కాశ్మీర్పైనే ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు. ఇందులో మూడో వ్యక్తి జోక్యాన్ని కూడా సహించబోమని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ (PM Modi ) సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. పహల్గామ్ ఊచకోత వ్యక్తిగతంగా తనను ఎంతగానో కలచివేసిందని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు భారత రక్షణ దళాలు 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టాయని తెలిపారు. ఉగ్రవాదుల తండాలను ధ్వంసం చేశాయని, ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని ప్రధాని మోదీ అన్నారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టిస్తామని స్పష్టం చేశారు. అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని పాకిస్థాన్ను గట్టిగా హెచ్చరించారు.
పహల్గామ్ ఘటనతో ప్రతీ హృదయం జ్వలించింది : PM Modi
భారత నిఘా వర్గాల సామర్థం, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. భారత రక్షణ దళాలు చూసిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికం. పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరి అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడితో దేశమంతా నివ్వెర పోయింది. ఉగ్రవాద దాడులపై ప్రతి హృదయం జ్వలించింది. పౌరులు, పార్టీలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. భారతీయ మహిళల నుదిటిపై సిందూరం తుడిచేసే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సిందూర్. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసిందని తెలిపారు.
భారత మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో బహావల్పుర్, మురుద్కే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితిని భారత్ సృష్టించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు ఏం చేస్తుందో భారత్ చెప్పిందని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.