Posani Krishna Murali : సినీ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) (ని ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) ఈ రోజు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ చేపట్టింది. పోసానిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చి గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయానికి తరలించారు.
Posani Krishna Murali : అరెస్టు అయినప్పటి నుంచి జైలులోనే..
గతవారం గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పోసానిని ఒకరోజు పోలీస్ కస్టడీలోకి అప్పగించింది. ఫిబ్రవరి 26న హైదరాబాద్లో అరెస్టు అయినప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో ఆయనకు బెయిల్ లభించినప్పటికీ వారం రోజుల క్రితం కర్నూలు జైలులో ఉన్న పోసానిని ప్రిజనర్ ట్రాన్సిట్ (PT) వారెంట్పై సీఐడీ గుంటూరుకు తీసుకొచ్చింది. అక్కడ కోర్టులో హాజరు పరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
పోసానిని ఎందుకు అరెస్టు చేశారు?
గతేడాది అక్టోబరులో తెలుగుదేశం (Telugu Desam Party (TDP) నాయకుడు ఒకరు ఇచ్చిన ఫిర్యాదుపై పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన సమయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 111, 196, 353, 299, 341, 336 (3) సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్లో అరెస్టయిన తర్వాత ఆయన్ను అన్నమయ్య జిల్లా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సామాజిక వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా ప్రయత్నించినట్లు ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసులో కోర్టు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించింది. అనంతరం కర్నూలులోని ఆదోని పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులో PT వారెంట్పై అక్కడికి తరలించి జైలులో ఉంచారు. కర్నూలు నుంచి విజయవాడకు మరో కేసులో PT వారెంట్ తీసుకుని తరలించారు.
బెయిల్ లభించినా విడుదల కాని Posani
కొన్ని కేసుల్లో కోర్టులు పోసానికి బెయిల్ మంజూరు చేసినా CID మరిన్ని PT వారెంట్లు దాఖలు చేయడంతో జైలు నుంచి ఆయన విడుదల కాలేకపోయారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) భగ్గుమంది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పోసానిపై 17 కేసులు నమోదు చేయడం రాజకీయ కక్షసాధింపులో భాగమని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేసి, ఆయన కేసుల వివరాలను గోప్యంగా ఉంచి ప్రాసెస్ను ఆలస్యం చేయాలని ప్రయత్నించిందని ఆరోపించింది.
ప్రభుత్వం ప్రతి కేసులోనూ PT వారెంట్లను కోరుకోవడం వల్ల పోసానిని రాష్ట్రవ్యాప్తంగా వందల కిలోమీటర్లు తిప్పించాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు, అక్కడి నుంచి రాజంపేట, నరసరావుపేట, గుంటూరు, కర్నూలు జిల్లా ఆదోని, తిరిగి విజయవాడలోని సూర్యరావుపేట, కర్నూలు, చివరకు మళ్లీ గుంటూరుకు తరలించారు. 67 సంవత్సరాల వయస్సున్న పోసాని గుండె సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఒత్తిడికి గురిచేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..