Hyderabad | హైదరాబాద్ బాచుపల్లిలో నిర్మించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (Telugu University) కొత్త క్యాంపస్ ను సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. 100 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయ నిర్మాణానికి రూ.35 కోట్లు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం 39వ వ్యవస్థాపక దినోత్సవాలను సైతం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ విద్యార్థులకు కంప్యూటర్ల వినియోగంలో 100 కంప్యూటర్లను కేటాయించనున్నట్టు హామీ ఇచ్చారు. విద్యార్థులు డిగ్రీలు పూర్తిచేసుకునే లోగా వారికి ఇష్టమైన రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపైనే సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కృత్రిమ మేథలో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు. మన సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని భావితరాలకు అందించే లక్ష్యంతోనే తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని చెప్పారు. పద్మభూషణ్ వరప్రసాద రెడ్డికి విశిష్ట . పురస్కారంతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. కాగా, తెలుగు విశ్వవిద్యాలయ అభివృద్ధికి వరప్రసాద రెడ్డి కోటి రూపాయల విరాళం అందించారు. విశ్వవిద్యాలయం విద్యార్థుల చిత్ర లేఖనం ప్రతిభను అమెరికా, మలేషియా దేశాల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో చూశామని తెలిపారు. ఉప కులపతి నిత్యానందరావు నేతృత్వంలో తెలుగు విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.
1 Comment
[…] రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హాన్సెన్ […]