న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకం (MNREGA) పేరు మార్పు మరియు దాని రూపురేఖలను మారుస్తూ కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’ బిల్లుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు.
యుపిఏ హయాంలో కోట్లాది మంది పేదలకు అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీజీ పేరును తొలగించడం జాతిపితను అవమానించడమేనని రాహుల్ అన్నారు. ఈ కీలక నిర్ణయాన్ని కనీసం కేబినెట్లో చర్చించకుండా, సంబంధిత శాఖా మంత్రులతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. “ఇది ప్రజాస్వామ్యమా? లేక ఒకే వ్యక్తి నిర్ణయాలు అమలు చేసే రాచరిక వ్యవస్థా?” అని రాహుల్ ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీకి గాంధేయ సిద్ధాంతాలన్నా, పేదల హక్కులన్నా తీవ్ర వ్యతిరేకత ఉందని రాహుల్ ఆరోపించారు. కరోనా వంటి సంక్షోభ సమయాల్లో గ్రామీణ కుటుంబాలను ఆకలి నుండి కాపాడిన ఈ పథకాన్ని ఇప్పుడు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కొత్త బిల్లు ప్రకారం నిధుల కేటాయింపులో కేంద్రం కోతలు పెట్టి, రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారాన్ని మోపుతోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
జనవరి నుండి ‘సేవ్ ఎంజీఎన్ఆర్ఈజీఏ’ ఉద్యమం
ఉపాధి హామీ పథకం అనేది కేవలం ఒక స్కీమ్ కాదని, అది గ్రామీణ పేదల ‘పని హక్కు’ అని రాహుల్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన మార్పుల వల్ల భవిష్యత్తులో నిధులు లేక పేదలకు పని దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయానికి నిరసనగా దేశవ్యాప్తంగా పోరాడాలని సిడబ్ల్యూసీలో నిర్ణయించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ నుండి వీధుల వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







