Shaktikanta das : శక్తికాంత దాస్ లౌక్యం కలిగిన ఆర్థికవేత్తగా పేరుతెచ్చుకున్నారు. ఆర్బీఐ (Reserve Bank of India) చరిత్రలో ఆరేళ్లపాటు పదవిలో కొనసాగిన రెండో గవర్నర్గా ఆయన గుర్తింపు పొందారు. తన సమతుల్య పనితనంతో విపత్కర పరిస్థితులను అధిగమించిన గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చివరి వరకు అదే స్ఫూర్తిని కనబరిచారు. ఆర్బీఐ గవర్నర్ రిటైర్ అవుతున్న 67 ఏళ్ల శక్తికాంత దాస్ గొప్ప ఆర్థిక నిపుణుడిగా పేరుతెచ్చుకున్నారు.
మాటకు కట్టుబడి…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా 2018 డిసెంబరులో బాధ్యతలు స్వీకరించిన శక్తికాంత దాస్ తన మొదటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ఆర్బీఐ అనేది గొప్ప వారసత్వం గల సంస్థ. దీని వృత్తిపర పనితనం, ప్రాథమిక విలువలు, విశ్వసనీయతకు విఘాతం కలగనివ్వను. ఆర్బీఐ విశిష్టతకు ఎక్కడా భంగం కలిగించను’ అన్నారు. ఈనెల 11న (2024 డిసెంబరు 11) ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో శక్తికాంత దాస్పై ప్రసంసల జల్లు కురుస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరేళ్లపాటు ఆయన సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారని వ్యాపార, వాణిజ్య దిగ్గజాలు, ఆర్థికవేత్తలు కొనియాడుతున్నారు.
పరిస్థితులను చక్కబెట్టిన శక్తికాంత దాస్
శక్తికాంత దాస్ ప్రయాణం నార్త్బ్లాక్ నుంచి మింట్ స్ట్రీట్ వరకు ఒక వాణిజ్య సర్వే అధికారిగా, అలాగే భారత ఆర్థిక వ్యవస్థలో కీలక సర్వోన్నత అధికారిగా కొనసాగింది. భారత ఆర్థిక వ్వవస్థపై లోతైన అవగాహన కలిగిన నిపుణుడిగా ఆయన పేరుగడించారు. ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ నిర్వర్తించిన బాధ్యతలే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకు ముందు గవర్నర్గా కొనసాగిన ఉర్జిత్ పటేల్ పదవీకాలంలో ప్రభుత్వంతో ఆర్బీఐకి తీవ్రంగా దెబ్బతన్న సంబంధాలను దాస్ అనతికాలంలోనే చక్కబెట్టారని తెలుస్తోంది. కొవిడ్ కాలంలో విపత్కర ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా అధిగమించిన ఆర్బీఐ గవర్నర్గా ఆయన పేరుతెచ్చుకున్నారు.
కొవిడ్ కాలంలో…
కొవిడ్-19 మహమ్మారి వల్ల జరిగిన ఆర్థిక సంక్షోభం శక్తికాంత దాస్ ముందు ఒక ప్రధాన సవాల్గా నిలిచింది. ఆర్బీఐ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మానిటరీ ఈజింగ్ను ఆయన అమలు చేశారు. 2020లో రెపో రేటును 4 శాతానికి తగ్గింది. ఈ క్రమంలోనే లోన్ మారిటోరియం, లిక్విడిటీ ప్యాకేజీలను ఆర్బీఐ అమలు చేసింది. విపత్కర పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో ఈ చర్యలు కీలకంగా నిలిచాయి.
బ్యాంకర్లపై చర్యలు
శక్తికాంత దాస్ 2021లో రిటైర్ కావాల్సి ఉండగా ఆయన పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగించారు. ఈ క్రమంలోనే ఎస్ బ్యాంక్, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (PMC) బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకింగ్ సంక్షోభాలను శక్తికాంత దాస్ సమర్థంగా పరిష్కరించారు. సరైన సమయానికి తీసుకున్న చర్యలు, విలీనాలు బ్యాంకింగ్ రంగానికి వ్యవస్థాపక ప్రమాదాలను అధిగమించారు. దాస్ నేతృత్వంలోనే బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్ వంటి పెద్ద సంస్థలపైనే కాకుండా సూక్ష్మ ఆర్థిక సంస్థలపైనా ఆర్బీఐ పకడ్బందీ చర్యలు తీసుకుంది. వడ్డీ రేట్ల నిర్దేశంలో స్వేచ్ఛ వసూలు దారుణమైన స్థాయికి చేరుతోందని గుర్తించి తగిన చర్యలు తీసుకున్నారు.
డిజిటల్ బ్యాంకింగ్పై దృష్టి
భారత డిజిటల్ విప్లవానికి దాస్ కట్టుబడి ఉన్నారు. UPI లాంటి కార్యకలాపాలను ప్రోత్సహించారు. దీంతో ఆర్థిక లావాదేవీలు సులభతరమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ బ్యాంకింగ్పై ఆయన దృష్టి పెట్టి, ఈ విధానాన్ని విస్తృత పరిచారు. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణ మధ్య సమతుల్యతను శక్తికాంత దాస్ కాపాడారని తెలుస్తోంది. పెరుగుతున్న చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి గ్లోబల్ ఒత్తిళ్ల మధ్య ఆయన సొంత నిర్ణయాలను తీసుకుంటూ సమతుల్యతగల నిపుణుడిగా పేరు గడించారు.
గ్లోబల్ టాప్ సెంట్రల్ బ్యాంకర్ శక్తికాంత దాస్
కేంద్ర బ్యాంకింగ్ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా శక్తికాంత దాస్ అనేక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. గ్లోబల్ టాప్ సెంట్రల్ బ్యాంకర్గా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వరుసగా రెండుసార్లు ఆయన్ను గుర్తించింది. ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక వృద్ధి, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణను సమర్థ పాత్ర పోషించినందుకు ఆయనకు A+ గ్రేడ్ లభించింది.
‘శక్తికాంత దాస్ పదవీకాలం ప్రధాన సమస్యలతో ప్రారంభమైంది. కొవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రేన్ యుద్ధ ప్రభావం వీటిలో ప్రధానమైనవి. అయితే.. ఆర్బీఐ, భారత్లో వినూత్నమైన మార్పులను తీసుకురావడంలో దాస్ పదవీకాలం ప్రత్యేకంగా నిలిచింది’ అని లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా ఎక్స్(ట్విట్టర్) లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..