Revanth Reddy meets PM Modi : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి (Chief Minister A Revanth Reddy) దేశ రాజధాని ఢిల్లీకి బుధవారం బయల్దేరారు. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహాయాన్ని కోరారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి (Andhra Pradesh Reorganisation Act) సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి వివరించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Revanth Reddy meets PM Modi : టన్నెల్ ప్రమాదంపై చర్చ
ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం గురించి కూడా ముఖ్యమంత్రి ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై కేంద్ర సహాయాన్ని కోరారు. కార్మికులను కాపాడేందుకు ప్రస్తుతం జరుగుతున్న రక్షణ చర్యల వివరాలను ఆయన మోదీకి తెలియజేశారు.
బీసీ రిజర్వేషన్లు, కుల గణాంకాలు, ఎస్సీ వర్గీకరణ
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని కీలక అంశాలను కూడా ప్రధాని మంత్రితో సీఎం రేవంత్ చర్చించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పెంపు, కుల గణాంకాల కోసం సర్వే నిర్వహించడం, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సకరంచాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో మెట్రో రైలు విస్తరణ
హైదరాబాద్లో మెట్రో రైలును మరింత విస్తరించేందుకు నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ప్రత్యేకంగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ వరకు 22 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక సహాయాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు నగర విస్తరణను మరింత వేగవంతం చేయడమే కాకుండా రవాణా సమస్యలను అధిగమించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు.
మూసి రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్, రీజినల్ రింగు రోడ్
మూసి నది పునరుద్ధరణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రధానిని సీఎం కోరారు. మూసీ నది పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్ నగరానికి కొత్త రూపునిచ్చే ప్రణాళికను ఆయన వివరించారు. అలాగే రీజినల్ రింగు రోడ్ (RRR) ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడానికి కేంద్రం సహాయం అవసరమని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (HMDA), తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC), హైదరాబాద్ మెట్రో రైల్ (HMR) సంస్థలు ఈ ప్రాజెక్టులపై అధ్యయనాలు పూర్తిచేశాయని వివరించారు.
విభజన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని మోదీ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. ముఖ్యంగా తెలంగాణకు రావాల్సిన ప్రత్యేక నిధులు, కొత్త పరిశ్రమలు, విద్యా సంస్థల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాల్లో కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రానికి న్యాయమైన వాటాను ఇచ్చేలా కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..