HILT Policy Leak : తెలంగాణ (Telangana)లో హిల్ట్ పాలసీ లీకేజ్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పరిపాలన పరంగానే కాకుండా రాజకీయంగా ఇది పెద్ద దుమారం రేపింది. ప్రభుత్వానికి ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఈ పాలసీ పత్రాన్ని (Draft Document) లీక్ చేసిందెవరు.. దీని వెనుక ఉన్న వారెవవరు? అనే విషయంపై విజిలెన్స్ విభాగం విచారణ (Vigilance Investigation) చేపట్టింది. ఈ లీకేజ్ వ్యవహారాన్ని సీఎం రేవంత్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.
హిల్ట్ పాలసీ (HILT Policy) అంటే ఏమిటి?
హిల్ట్ పాలసీ (HILT Policy) అంటే హయ్యర్ ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ పాలసీ (Higher Impact Long-Term Policy) అని అర్థం. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేపట్టాల్సిన అభివృద్ధికి సంబంధించిన సమగ్ర విధానం ఇది. 10–15 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళికను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఈ పాలసీని రూపొందిస్తోంది. ఈ హిల్ట్ పాలసీ ద్వారా ముఖ్యంగా పరిశ్రమలు, IT, పెట్టుబడులు, ఇన్ఫ్రాస్టక్చర్, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధికి ప్రణాళికను తయారు చేస్తోంది. రాష్ట్రానికి పెద్ద పరిశ్రమలను ఆకర్షించడం, పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపర్చడం, యువతకు ఉద్యోగావకాశాలను పెంచడం, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం తదితర అంశాలతో రోడ్మ్యాప్ (Roadmap)ను రూపొందించడం దీని ముఖ్యోద్దేశం.
ఇది ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్లో ఉన్న రహస్య పత్రం. ఇటీవల దీని ముసాయిదా బయటకు లీక్ కావడం కలకలం సృష్టించింది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై చాలా సీరియస్గా ఉంది.
లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు?
విచారణలో భాగంగా హిల్ట్ పాలసీ లీకైన ముఖ్యమైన పత్రాలకు యాక్సెస్ ఉన్నవారి జాబితాను విజిలెన్స్ సేకరించిందని తెలిసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానాలు వ్యక్తమవుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పాలసీ ముసాయిదాతోపాటు సంబంధిత ఫైళ్లకు వీరిద్దరు యాక్సెస్ అయ్యున్నారని విజిలెన్స్ గుర్తించినట్టు తెలిసింది. వీరిద్దరే కాదు.. ఈ వ్యవహారంలో పరోక్షంగా మరికొందరి ప్రమేయం ఉండొచ్చనే ఆధారాలు విజిలెన్స్కు దొరికాయని తెలుస్తోంది.
పాలసీ బయటకు వెళ్లిన సమయంలో సిస్టమ్స్కు లాగిన్ అయిన వారు ఎవరు.. డాక్యుమెంట్లను యాక్సెస్ చేసిన వారెందరు వంటి డేటాను విజిలెన్స్ విశ్లేషిస్తోందని సమాచారం. అసలు లీక్ ఎక్కడ జరిగింది? దానికి అనుసరించిన పద్ధతి ఏమిటి? అనేది త్వరలోనే తేలనుందని తెలుస్తోంది.
సీఎంవోలోని అధికారి ప్రమేయంపై విచారణ?
ఈ కేసులో ముఖ్యంగా అనుమానాలకు గురైన వారిలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో పనిచేస్తున్న ఓ అధికారి ఉన్నట్లు సమాచారం. ఆయన్ను విజిలెన్స్ అధికారులు నిన్న రాత్రి నుంచి విచారిస్తున్నట్టు సమాచారం. పాలసీ డ్రాఫ్ట్కు ఆ అధికారికి ఎప్పుడు యాక్సెస్ లభించింది? ఆ ఫైల్ను ఎవరెవరికి పంపారు.. అదే రోజు ఆయన ఎవరెవరితో కమ్యూనికేట్ అయ్యారు.. ఎలాంటి ఇతర డాక్యుమెంట్లు ఆ రోజు హ్యాండిల్ చేశారు? అనే విషయాలను ఆరా తీస్తున్నారని తెలిసింది.
ఈ లీకైన సమాచారం వివిధ రాజకీయ వర్గాలకు వెళ్లిందని టాక్ వినిపిస్తోంది. పలువురు బీఆర్ఎస్ నాయకులతోపాటు బీజేపీకి చెందిన ఓ ముఖ్య నేతకు కూడా ఈ పాలసీ ముసాయిదా చేరినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
పాలసీ బయటపడ్డ వెంటనే రెండు పార్టీలకు చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు, మీడియా డిబేట్లలో అనుకోకుండా బయటపడ్డ వివరాలు.. ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







