Telangana Postal Circle : తెలంగాణ రాష్ట్రంలో పోస్టల్ సేవలను మరింత ప్రజానుకూలంగా మార్చేందుకు తెలంగాణ పోస్టల్ సర్కిల్ (Telangana Postal Circle) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వికార్బాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని ముఖ్యమైన ఎనిమిది పోస్టాఫీసుల్లో ఇక నుంచి 24 గంటలు (24×7 postal services) బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఏ సమయంలోనైనా స్పీడ్ పోస్టు, పార్సిల్స్, మనీ ఆర్డర్/రిమిటెన్స్ వంటి సేవలను పంపే అవకాశం లభించనుంది.
ప్రజలకు ఎలాంటి సమయ పరిమితి లేకుండా సేవలు అందించడం ఈ నిర్ణయం వెనుక ముఖ్యోద్దేశం. ఉద్యోగాలు, వ్యాపారాలు, అత్యవసర పరిస్థితుల్లో పోస్టల్ సేవలు ఉపయోగించేవారికి ఇప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు.
ఏయే పోస్టాఫీసుల్లో 24×7 సేవలు ?
కొత్తగా 24 గంటల సేవలు ప్రారంభమైన ఎనిమిది పోస్టాఫీసులు (Round-the-clock post offices) ఇవి:
- వికార్బాద్ జిల్లా : ఆలంపల్లి సబ్పోస్టాఫీస్
- రంగారెడ్డి జిల్లా : కూకట్పల్లి సబ్పోస్టాఫీస్, ఆటోనగర్ పార్సిల్ ప్రాసెసింగ్ సెంటర్ (PPC), షంషాబాద్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ (APTMO).
- హైదరాబాద్ జిల్లా : హైదరాబాద్ జనరల్ పోస్టాఫీస్ (GPO), స్పీడ్ పోస్టు సెంటర్, బేగంపేట, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ (TMO), సికింద్రాబాద్, హైదరాబాద్ డెక్కన్ RSTMO, నాంపల్లి.
ఇప్పుడు వీటిలో సండేలు, పబ్లిక్ హాలిడేలూ సహా రాత్రింబవళ్లు సేవలు అందుబాటులో ఉంటాయి. ఒక సీనియర్ పోస్టల్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజలు రోజు ఎప్పుడైనా స్పీడ్ పోస్టు డాక్యుమెంట్లు, పార్సిల్స్ పంపింపోచ్చు. మనీ రిమిటెన్స్ కూడా ఇప్పుడు 24 గంటలు (24×7 postal services) అందుబాటులో ఉంటుంది. అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దశల వారీగా 24 గంటల సేవలను విస్తరించాలని పోస్టల్ శాఖ నిర్ణయించినట్టు తెలిసింది.
పలు పోస్టాఫీసుల్లో టైమింగ్స్ పెంపు
మరోవైపు, హైదరాబాద్ నగరంలోని 32 పోస్టాఫీసుల్లో బిజినెస్ అవర్స్ను కూడా పెంచారు. పాత సమయాల బదులుగా ఇప్పుడు ఈ పోస్టాఫీసులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తాయి.
- సమయాలు పెంచిన ప్రాంతాల్లోని పోస్టాఫీసులు ఇవి: సికింద్రాబాద్, త్రిముల్ఘెర్రీ, సైనిక్పురి, మల్కాజ్గిరి, జామా-ఇ-ఉస్మానియా, ఖైరతాబాద్, ఎస్.ఆర్.నగర్, సనత్నగర్, మణికొండ, గోల్కొండ, బంజారా హిల్స్, చార్మినార్, ఉప్పల్, వనస్థలిపురం, ECIL, ఘట్కేసర్, జీడిమెట్ల, సంగారెడ్డి, షంషాబాద్
ఈ మార్పులు ముఖ్యంగా నగరంలో పోస్టల్ సేవలను ఎక్కువ మంది వినియోగించాలనే ఉద్దేశంతో చేశారని అధికారులు చెప్పారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.







