KCR | పదేండ్ల పాటు దగదగలాడిన తెలంగాణ ఇప్పుడు అంధకారంలోకి కూరుకుపోయిందని బిఆర్ఎస్ (BRS Party) అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. యావత్ భారతదేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని కానీ ఇప్పుడు అసమర్థ నిర్ణయాలు, తెలివితక్కువ పాలనతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి కాంగ్రెస్, టీడీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారు తప్ప ఎప్పుడూ కూడా కొట్లాడలేదు. గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయారు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసినవారు బీఆర్ఎస్ బిడ్డలు అని గర్వంగా చెబుతున్నా. కానీ, పదవుల కోసం తెలంగాణను ఆగం చేసినవారు ఆనాడు ఉన్న కాంగ్రెస్ నాయకులు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి.. ఎంత ఘోరమంటే.. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే మన శాసనసభలో తెలంగాణ పదాన్నే నిషేధించాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించాడు. ఇదే జిల్లాకు చెందిన ప్రయణ్ భాస్కర్ ఆ రోజు ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే.. అది నేరమైనట్లుగా పరిగణించి తెలంగాణ పదాన్నే నిషేధించే ప్రయత్నించారు. మీ అందరికీ చరిత్ర తెలుసని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమైంది. అది ఫలించి సొంత రాష్ట్ర కల కూడా నెరవేరింది. చీకట్లను పారదోలడానిక ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఒక మాట చెప్పాను. ఉద్యమం నుంచి వెనక్కి మళ్లితే, ఉద్యమ జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపాండని అని చెప్పి ఉద్యమాన్ని ప్రారంభించాను. ఆ తనదనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ప్రజలు ప్రాణం పోసి ఊపిరిలూదితే అద్భుతంగా ఉద్యమం పురోగమించింది. 60 ఏండ్ల సమైక్య పాలనలో ఎంతో వేదన, హింస, అణిచివేత చూశాం.. అందరికీ బాగా తెలుసు. గోదావరి, కృష్ణా నీళ్లు దక్కకకుండా తరలిపోతే తల్లి చనుబాలకు నోచని పిల్లలాగా తెలంగాణ బిడ్డలు రోదించారు. కురువు, కాటకాలకు గురయ్యారు. పాములు, తేళ్లు కుట్టి అనాథాల్లాగా చనిపోయారు అని కేసీఆర్ తెలిపారు.

జనసంద్రంగా మారిన ఎల్కతుర్తి
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.. జనసంద్రమైంది. నలు దిక్కులా ఎటుచూసినా జనమే కనిపించారు. ఇసుకెస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా చీమల దండులా తలపించింది. . సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు తీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్స్లు చేసి అక్కడికి వచ్చినవారిని ఊర్రూతలూగించారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోయారు. . గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు.
మరోవైపు ఎల్కతుర్తికి నలువైపులా.. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. జనాలు తమ వాహనాలను దిగి నడకదారిన ఎల్కతుర్తికి తరలివచ్చారు. కేసీఆర్ ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి చేరుకోగానే.. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది.