హన్మకొండ జిల్లాలోని దామెర మండలం ల్యాదల్లలో గల లక్ష్మీగణపతి రైస్ మిల్లులో ధాన్యం నిల్వలపై పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. పౌరసరఫరాల శాఖ రికార్డులకు, మిల్లులో క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు పొంతన లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి సుమారు 20 ఏసీకేల (ACKs) బియ్యం బాకీ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
పౌరసరఫరాల శాఖ రికార్డుల ప్రకారం.. 2025-26 ఖరీఫ్ సీజన్లో ఈ మిల్లుకు ప్రభుత్వం 1823.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. నిబంధనల ప్రకారం.. మిల్లర్ ఈ ధాన్యాన్ని మరాడించి మొత్తం 43 ఏసీకేల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు కేవలం 23 ఏసీకేలు మాత్రమే సివిల్ సప్లై రికార్డుల్లో నమోదయ్యాయి. అంటే, ఇంకా సగానికి పైగా (20 ఏసీకేలు) బియ్యం పెండింగ్లో ఉన్నాయి.
గోల్మాల్ జరిగిందా?
మిల్లులో ఉండాల్సిన మిగతా ధాన్యం నిల్వలు అసలు అక్కడ ఉన్నాయా? లేక పక్కదారి పట్టాయా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. సుమారు 20 ఏసీకేల బియ్యానికి సరిపడా ధాన్యం నిల్వలు మిల్లులో కన్పించడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హన్మకొండ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు పౌరసరఫరాల శాఖ వర్గాల్లోనూ ఈ మిల్లులోని నిల్వలపై తీవ్ర చర్చ జరుగుతోంది.
అదనపు కలెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసేనా?
లక్ష్మిగణపతి మిల్లు వ్యవహారంలో పారదర్శకత రావాలంటే ఉన్నతాధికారుల తనిఖీ అనివార్యమని తెలుస్తోంది. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగి ఫిజికల్ వెరిఫికేషన్ (భౌతిక తనిఖీ) నిర్వహిస్తేనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని తెలుస్తోంది. తక్షణమే అదనపు కలెక్టర్ ఈ మిల్లును సందర్శించి నిల్వలను స్వయంగా లెక్కిస్తే విస్తుపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఒకవేళ తనిఖీల్లో ధాన్యం నిల్వలు తక్కువగా ఉన్నట్లు తేలితే, సదరు మిల్లు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. మరి జిల్లా అదనపు కలెక్టర్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.








