- మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
- హనుమకొండ జిల్లా తాటికాయ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
Hanumakonda | హనుమకొండ జిల్లాలో అత్యంత ఘోరమైన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మసాగర్ మండలం తాటికాయల(Thatikayala) గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ మహిళను ఇనుప గ్రిల్స్ కట్టి, వివస్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి చిత్రహింసలకు గురిచేశారు. తప్పు చేశానని క్షమించమని వేడుకున్నా వినకుండా దాడికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు విచారణ చేపట్టారు.
గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఇటీవల కాలంలో రాజు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 10 రోజుల క్రితం ఇద్దరూ కలిసి గ్రామం నుంచి పారిపోయారు. వీరిద్దరి కోసం గాలించిన రాజు కుటుంబ సభ్యులు ఎట్టకేలకు వారిని వెతికి పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చారు. ఆమెను ఇనుప గ్రిల్స్కు కట్టేసి వివస్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి చిత్ర హింసలకు గురిచేశారు. అంతటితో ఆగకుండా ఇద్దరికీ గుండు గీయించారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అనంతరం రాజు, మహిళ కనిపించకుండా పోయారు. మహిళపై దాడి దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ధర్మసాగర్ పోలీసులు తాటికాయల గ్రామానికి చేరుకుని దాడిలో పాల్గొన్న కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కనిపించకుండా పోయిన రాజు, మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.