Adani | ముంబైలోని ధారావి పునరుద్ధరణ ప్రాజెక్టుకు అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ మంజూరును బాంబే హైకోర్టు (Bombay High Court) సమర్థించింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్ను ఈ రోజు కొట్టేసింది. అభ్యంతరాలకు బలమైన కారణాలు చూపకపోవడంతో దీన్ని తిరస్కరిస్తున్నామని చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ అమిత్ బోర్కర్ లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Adani Properties Private Ltd)కు టెండర్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (UAE-based Seclink Technologies Corporation) సంస్థ ఈ పిటీషన్ను 2022లో దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన హైకోర్టు తన తీర్పును వెలువరించింది.
టెండర్ ఖరారుతో వివాదం
2022లో నిర్వహించిన 259 హెక్టార్ల ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్ (Dharavi slum redevelopment project) టెండర్లో అదానీ గ్రూప్ రూ. 5,069 కోట్లతో టెండర్ దాఖలు చేసింది. 2018లో మొదటిసారి జారీ చేసిన టెండర్ ప్రక్రియలో పిటిషనర్ కంపెనీ రూ. 7,200 కోట్ల ఆఫర్తో అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. 2018 టెండర్ను ప్రభుత్వం రద్దు చేసి, 2022లో కొత్త షరతులతో మరోసారి టెండర్ను ఆహ్వానించి అదానీ కంపెనీకి ఆమోదముద్ర వేసింది. 2018 టెండర్ రద్దు చేయడం, 2022లో అదానీకి టెండర్ ఖరారు చేయడాన్ని సెక్లింక్ టెక్నాలజీస్ కోర్టులో సవాలు చేసింది.
2018 నవంబరులో మొదటి టెండర్ను ప్రభుత్వం ఆహ్వానించింది. 2019 మార్చిలో బిడ్లు తెరవగా పిటిషనర్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. అదే నెలలో భారతీయ రైల్వేలు ద్వారా ప్రాజెక్ట్ కోసం అదనంగా 45 ఎకరాల భూమిని ప్రభుత్వం పొందింది.
ప్రభుత్వ వాదనలు
టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, అదానీ గ్రూప్నకు ఎలాంటి అన్యాయం చేయలేదని హైకోర్టులో ప్రభుత్వం (Maharashtra government ) వాదనలు వినిపించింది. 2018 టెండర్ రద్దు చేయడం, 2022లో కొత్త టెండర్ జారీ చేయడానికి COVID-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ఆర్థిక పరిస్థితుల ప్రభావమే కారణమని వివరించింది.
సర్కార్ అభ్యంతరాలు ఇలా..
టెండర్ ప్రక్రియ అనంతరం పిటిషనర్ కంపెనీతో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని, అందువల్ల ఈ అంశంలో ఆ సంస్థకు ఎటువంటి చట్టపరమైన హక్కు లేదని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2020 నవంబరులో ప్రభుత్వం 2018 టెండర్ను రద్దు చేస్తూ రిజల్యూషన్ను జారీ చేసిందని, ఈ నూతన టెండర్ ప్రక్రియలో పిటిషనర్ కంపెనీ కూడా కొత్త షరతులకు అనుగుణంగా బిడ్ సమర్పించాల్సి ఉండగా ఆ దిశగా ప్రయత్నించలేదని తెలిపింది.
ప్రభుత్వం టెండర్ను రద్దు చేసి కొత్త టెండర్ జారీ చేయడంలో చేసిన చర్యలకు వ్యతిరేకంగా ప్రాతిపదికగా ఉన్న కారణాలు బలహీనంగా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. దీంతో ఈ పిటీషన్ను పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
3 thoughts on “Adani : అదానీకి భారీ ఊరట.. ‘ధారావి’పై దాఖలైన పిటిషన్ కొట్టివేత!”