Formula E race case : ‘ఫార్ములా ఈ’ రేసు కేసులో తనపై చర్యలు తీసుకోవడానికి అవినీతి నిరోధక విభాగానికి (ACB) అనుమతినిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘X’ ద్వారా ఆయన మంగళవారం తీవ్రంగా ప్రతిస్పందించారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
తనపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్దేశించి ‘చిట్టి నాయుడు’ అంటూ కేటీఆర్ సంభోదించారు. ‘ఢిల్లీలో బీజేపీతో చేసుకున్న ఒప్పందాల ఫలితాలు కనిపిస్తున్నాయి’ అని కూడా వ్యాఖ్యానించారు. ఢిల్లీకి రేవంత్రెడ్డి 30 సార్లు వెళ్లి రాష్ట్రానికి కొన్ని నిధులైనా తెచ్చుకోలేకపోయారని, తనపై మాత్రం మూడు కేసులు పెట్టడం ద్వారా రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులు న్యాయపరంగా ఎదుర్కొంటానని, మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించుకోండని సవాల్ విసిరారు.
Formula E race case ఏమిటంటే…
ఫార్ములా ఈ- సీజన్ 10 రేసు నిర్వహణకు గత ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. దీన్ని ఫిబ్రవరిలో హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ఈవెంట్ను రద్దు చేసింది. కొన్ని పర్యావరణ, సాంకేతిక కారణాలను చూపెడుతూ మునిసిపల్ శాఖ ఈ కార్యక్రమాన్ని విరమించుకుంది. ఇదే క్రమంలో అప్పటి మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం పలు ఆరోపణలు చేసింది. ‘ఫార్ములా ఈ’ పేరుతో నిధుల దుర్వినియోగానికి ఆయన పాల్పడ్డారని, విధానాలను ఉల్లంఘించారని అంటోంది. తమ పాలనలో రేసు నిర్వహించడం ద్వారా ఓ ప్రైవేట్ కంపెనీకి కేటీఆర్ లబ్ధి కలిగించారని, రూ.110 కోట్ల ఒప్పందంలో రూ.55 కోట్లు చెల్లించగా మిగిలినది రెండు దఫాలుగా చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని రేవంత్రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు ఏసీబీకి అనుమతిని ఇస్తూ తీర్మానం చేసింది. ఆ ఫైల్పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేసి ఏసీబీ విచారణకు అనమతించారని మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ‘X’లో పోస్ట్ పెట్టారు.
‘ఫార్ములా’ ఈ అంటే..
ఫార్ములా ఈ అనేది ఒక అంతర్జాతీయ ఎలక్ట్రిక్ రేసింగ్ చాంపియన్షిప్. ఈ రేసులను పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహిస్తారు. ఇవి పర్యావరణానికి హానికరమనే వాదన ఉంది. అయితే.. నూతన ఆవిష్కరణలు, సాంకేతికత అభివృద్ధికి ఇవి దోహదపడతాయనే అభిప్రాయం కూడా ఉంది. ‘ఫార్ములా ఈ’ రేసులు వివిధ నగరాల్లో, మినీ-సిటి సర్క్యూట్లలో జరుగుతాయి. ఈ రేసు 2014లో ప్రారంభమైంది. ఇది కొత్తతరం వాహనాల సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేస్తూ రేసింగ్ ప్రపంచంలో కొత్త దిశలు చెలామణి చేస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








