దశల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాలు
Integrated Registration Buildings : రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల పరిధిలోకి తీసుకువస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం గచ్చిబౌలిలోని తాలిమ్లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సందర్బంగా ఏర్పాటైన సభలో మంత్రి పొంగులేటి ప్రసంగించారు. దేశంలోని 18 రాష్ట్రాలలో అధ్యయనం చేసి భూభారతి -2025 చట్టాన్ని రూపొందించామన్నారు. రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అభివృద్ది కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని, దానిలో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ భవనాల శంకుస్దాపన అని వివరించారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోగల 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపేణా సుమారు 62-63 శాతం ఆదాయం లభిస్తోందని, వీటిని 11 ఇంటిగ్రేటెడ్ భవనాల పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. నేడు శంకుస్ధాపన చేసుకున్న ఈ భవనం అత్యాధునిక కార్పొరేట్ స్ధాయిలో ఉండబోతోందన్నారు. సుమారు మూడు ఎకరాల్లో దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో , 300 కార్ల పార్కింగ్ సౌకర్యంతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఫైవ్ స్టార్ సౌకర్యాలు సుమారు 8-9 నెలల్లో ఈ భవనాన్ని నిర్మిస్తామని నిర్మాణ సంస్ధ చెబుతోందని, అయితే 6-7 నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రి సభా ముఖంగా కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభిస్తామని చెబుతూ దశల వారీగా మిగిలిన 10 ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని సౌకర్యాలతో ఇటువంటి భవనాల నిర్మాణం చేపడతామని తెలిపారు.
Integrated Registration Buildings : భూభారతి చట్టం మేరకు రైతన్నల , ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కొన్ని నెలల క్రితం రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీటిలో 2లక్షల దరఖాస్తులు పరిష్కారం కాగా సుమారు 4లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. రాష్ట్ర హైకోర్టు తాజాగా ఈ సాదాబైనామాలపై ఉన్నస్టేను తొలగించినందున నిజమైన, అర్హత కలిగిన దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
గచ్చిబౌలి లోని తాలిమ్లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనంలో ప్రత్యేకతలు
- బిల్డింగ్ నిర్మాణ వ్యయం : 30 కోట్లు
- మొత్తం స్థలం : 3 ఎకరాలు
- భవన వివరాలు : 3 ఫ్లోర్లు
- ఒక్కో ఫ్లోర్ : 16,000 చదరపు అడుగులు (Sq.ft)
- మొత్తం : 48,000 చదరపు అడుగులు (Sq.ft)
- డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ : 250 రోజుకు
- ఆదాయం : రూ.2,800 కోట్ల ఏడాదికి
- అధికారులు : 06 ఎస్.ఆర్.వో లు & 01 డి.ఆర్.వో
- 01 డి.ఐ.జి.
Integrated Registration Buildings లో ప్రత్యేకతలు
- వెయిటింగ్ హాల్,
- టోకెన్ సిస్టమ్,
- వివాహ రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ఆడదపడుచులకోసం ప్రత్యేక హాలు, అలాగే ఫీడింగ్ రూమ్, చిన్నపిల్లల కోసం క్రష్ సెంటర్,
- వృద్దుల కోసం ర్యాంప్ సౌకర్యం,
- వీల్ చైర్ సదుపాయం,
- లిఫ్ట్
- పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా 300 కార్లకు పార్కింగ్ సదుపాయం
- గ్రీన్ బిల్డింగ్
- సోలార్ సిస్టమ్
- కేఫ్
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    