Hanamkonda Rice Mill Scam Paddy Missing News : హన్మకొండ జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు మాయమైతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు మిల్లర్లు ఆడుతున్న ‘మాయాజాలం’ బయటపదుతోంది. దామెర మండలం ల్యాదల్లలోని లక్ష్మిగణపతి, పంథినిలోని వైష్ణవి రైస్ మిల్లుల్లో సుమారు రూ. 3.5 కోట్లకు పైగా విలువైన ధాన్యం పక్కదారి పట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది.
”లక్ష్మిగణపతి” లో ఖాళీ సంచులే దర్శనం!
దామెర మండలం ల్యాదల్ల గ్రామంలో ని లక్ష్మిగణపతి రైస్ మిల్లులో రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదు. సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే ధాన్యం మాయమైనట్లు సమాచారం. అక్కడ ధాన్యపు రాశులకు బదులు కేవలం ఖాళీ సంచులే దర్శనమివ్వడం మిల్లర్ నిర్వాకానికి అద్దం పడుతోంది.
“వైష్ణవి “మిల్లులోనూ అదే బాట..
ఇక పంథిని గ్రామంలోని వైష్ణవి మిల్లు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇక్కడ కూడా దాదాపు రూ. 1.5 కోట్ల విలువైన వడ్లు గల్లంతయ్యాయి. ప్రభుత్వం నుంచి సేకరించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి అప్పగించాల్సి ఉండగా, కొందరు మిల్లర్లు ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Hanamkonda Rice Mill Scam : ‘సివిల్ సప్లై’ కళ్లు గప్పారా? లేక సహకరించారా?
ఈ మొత్తం వ్యవహారంలో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ ల (DT) ల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా స్టాక్ వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం మాయమవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వడ్లు మాయమైనా డిటి ( DT) లకి ఎందుకు కనిపించలేదు?
రికార్డుల్లో నిల్వలు ఉన్నట్లు చూపిస్తూ క్షేత్రస్థాయిలో ఖాళీగా ఉంచడం వెనుక మర్మమేంటి?
అధికారులు మిల్లర్లతో కుమ్మక్కయ్యారా? అన్న సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండబట్టే ఈ స్థాయిలో అక్రమాలకు తెగబడ్డారని సమాచారం. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం అవుతున్నా, పర్యవేక్షించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తం’ ఎవరిదనే కోణంలో విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలి..
హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు సివిల్ సప్లై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గల్లంతైన ధాన్యం విలువను మిల్లర్ ల నుండి రికవరీ చేయడంతో పాటు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఇప్పటికైనా సదరు రెండు మిల్లులపై అలాగే ఇద్దరు డిటీలపై జిల్లా కలెక్టర్ విచారణ చేస్తారో లేదో చూడాల్సిందే.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు








