- హైదరాబాద్లో వరదల నివారణకు ‘మూసీ పునరుజ్జీవనమే’ మంత్రం
- హైదరాబాద్లో వర్షాల ప్రభావం తగ్గించేందుకు సీఎం ప్రత్యేక ప్రణాళిక
- మూసీకి అనుసంధానం – చెరువులు, కుంటలు, నాలాల కలయికతో నగర భద్రత
Hyderabad Rains | హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేలా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Ravanth Reddy) ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించాలని ఆదేశించారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్రి హైదరాబాద్ లో కురిసిన వర్షం, తలెత్తిన ఇబ్బందులు, అధిగమించేందుకు అనుసరించాల్సిన తక్షణ చర్యలపై అధికారులతో సమీక్ష అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
భారీ వర్షం (Hyderabad Rains ) ఒకేసారి కురవటంతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. తక్కువ సమయంలో కుండపోత వర్షం పడటంతో జనజీవనం స్తంభించిపోతోంది. సాధారణంగా మూడు నాలుగు నెలల్లో కురిసే వర్షపాతం మొత్తం ఒకే రోజున దంచికొడుతుండడంతో నగరం అతలాకుతలమవుతోందని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అందుకు తగినట్లుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరముందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోందని అన్నారు.
ఎంత వర్షం పడినా గ్రేటర్ హైదరాబాద్ సిటీలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా, వరద నీటితో ముంపు గురవకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా అత్యంత పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని, అందుకు వీలుగా రూపొందిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవకుండా ఉంటాయన్నారు.
వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉన్నందునే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
నగరంలో ఉన్న హుస్సేన్ సాగర్, దుర్గం చెర్వు, మీర్ అలం చెర్వులతో పాటు ప్రతీ చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీ (Musi River) కి అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల) ద్వారా శుద్ధి చేసి మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండేందుకు వీలుగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. నగరంలో ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటునుంచి మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








