ప్రతిపక్షాలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్
వరంగల్/ ములుగు : మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్ అంటూ ప్రతిపక్షాలు, కొన్ని రాజకీయ పత్రికలు దేవుడిపై రాజకీయాలు, తప్పుడు వార్తలు రాయడం సరికాదని మంత్రి సీతక్క హితవు పలికారు.
గత ప్రభుత్వం రూ.10 కోట్లతో చెక్ డ్యాములు కట్టి వాటిని కూల్చడానికి రూ.కోటి ఖర్చు చేసిందని, కానీ తమ ప్రభుత్వం అలా కాదని, పెట్టిన ప్రతీ రూపాయి శాశ్వతంగా నిలిచిపోయేలా కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. అధికారం కోసం, అలంకారం కోసం కాదు.. మా అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం భక్తుల విశ్వాసం కాపాడేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. మరో వారం రోజుల్లో పనుల అభివృద్ధి మీకే కనిపిస్తుందని, దేవుడి దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు.. రాజకీయాలు వద్దని వార్నింగ్ ఇచ్చారు. ములుగు జిల్లా (Mulugu) సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలోని మేడారంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ అడ్లూరి లక్ష్మణ్ బుధవారం పర్యటించి సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రకృతి దేవతలు సమ్మక్క సారలమ్మల (Medaram Jatara) ను కోట్ల మంది భక్తులు సందర్శించుకుంటున్నారంటే అది వారి విశ్వాసం.. ఆ విశ్వాసాలను పటిష్టం చేసే విధంగానే పనులు కొనసాగుతున్నాయని, ఆదివాసుల అస్తిత్వం, భక్తుల నమ్మకం, వనదేవతల త్యాగం చరిత్రలో నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు.
చిత్తశుద్ధితో పనులు చేపడుతున్నాం..
సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు అంటే మాకు(సీఎం, మంత్రులకు) ఉండేది బంధం, బాధ్యత, భక్తి, భావోద్వేగం.. అందుకే నిష్ఠతో, చిత్తశుద్ధితో మేడారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి అనసూయ సీతక్క అన్నారు. మహా మేడారం జాతర లోపు అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేస్తామన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







