బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి మృతిపై ఇంకా తొలగని సందిగ్ధత
Warangal News | గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ల్యాదల్ల రాజు అలియాస్ లవ్ రాజ్ అనుమానాస్పద మృతి (Death Mystery) పై 30 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. దర్యాప్తులోనూ ఎలాంటి స్పష్టత రాకపోవడం స్థానికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. గత నెల అక్టోబర్ 18న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజు మరుసటి రోజు 19న ఉదయం మొగిలిచెర్ల శివారులోని చెట్ల పొదల్లో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. రాజు స్వస్థలం గొర్రెకుంట అయినప్పటికీ అతని మృతదేహం మాత్రం మొగిలిచెర్లలో లభించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఒక పార్టీ గ్రామ అధ్యక్షుడిగా అందరికీ సుపరిచితుడు కావడంతో గొర్రెకుంట, మొగిలిచెర్ల, పోతరాజుపల్లి, కీర్తినగర్, జాన్పాక సహా పరిసర గ్రామాల్లో లవ్రాజ్ మరణంపై రకరకాల ప్రచారం జరుగుతోంది.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్… అయినా స్పష్టత లేదు..
డాగ్ స్క్వాడ్ సుమారు 30 నిమిషాల పాటు తనిఖీ చేసింది, క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలంలో లోతుగా దర్యాప్తు చేసింది. పోలీసులు కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు, పలువురిని విచారించినప్పటికీ ఇప్పటివరకు కేసు ఏ దిశగా సాగుతోందనే విషయం మాత్రం బయటకు రావడం లేదు. ప్రతిపక్ష పార్టీ (బిఆర్ఎస్) అధ్యక్షుడి కేసులో కూడా నెల రోజులైనా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ప్రజల్లో అనుమానాలు రెట్టింపవుతున్నాయి.
మొగిలిచెర్ల శివారులో డెడ్ బాడీ ఎందుకున్నట్లు?
అసలు రాజు అక్కడికి ఎందుకు వెళ్లాడు? రాజుకు మొగిలిచెర్లతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో ఈ ప్రశ్నలు మరింత మిస్టరీగా మారాయి. ఆయన ఎవరినైనా కలవడానికి వెళ్లి ఉండొచ్చా? లేకపోతే ముందే పన్నిన ప్లాన్ ప్రకారం అక్కడికి ఎవరైనా తీసుకెళ్లారా? మొగిలిచెర్లలో ఏం జరిగింది? డెడ్బాడీ అక్కడే ఎందుకు ఉంది.? ఇలా అనేక ప్రశ్నలు ప్రస్తుతం మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు స్థానికుల్లో చర్చనీయాంశాలయ్యాయి. రాజు భార్య కూడా ఆయన మృతి సహజ మరణం కాదన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది.
సీసీ కెమెరా ఫుటేజ్లు కీలకం… అవి భద్రమేనా?
మొగిలిచెర్ల గ్రామ పరిసరాల్లో 25కు పైగా సీసీ కెమెరాలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామ ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో కూడా కెమెరాలు ఉన్నాయి. అయితే పోలీసులు ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్లను స్వాధీనం చేసుకున్నారా? ఆ ఫుటేజ్ లను పరిశీలిస్తే పోలీసులకు ఏమైన అవసరమైన ఆధారాలు దొరికాయా? ఫుటేజ్లు అన్నీ ఇంకా భద్రంగా ఉన్నాయా? అనే విషయాలు పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించకపోవడం ప్రజల్లో మరింత సందేహాలను రేకెత్తిస్తోంది.
స్థానికుల్లో పెరుగుతున్న ఆందోళన..
ఈ కేసులో ప్రతి అంశం మిస్టరీగానే మిగిలిపోతోంది. మృతదేహం దొరికిన ప్రదేశం, లవ్ రాజు ఆ ప్రాంతానికి వెళ్లిన కారణం? మరణానికి దారితీసిన పరిస్థితులు? వీటన్నింటిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాస్పద మృతిపై పోలీసులు త్వరగా నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇప్పటికైనా గీసుగొండ పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేసి త్వరగా నిజానిజాలు వెల్లడించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







