Bus Fire in Nalgonda | ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్లపై ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇటీవలే కర్నూలులో వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో 19 మంది సజీవ దహనమైన ఘటన (Kurnool Bus Fire) మరిచిపోకముందే, మళ్లీ ఇలాంటి ఘటనే నల్లగొండలో చోటుచేసుకుంది. ఈసారి విహారి ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ, అందులో ఉన్న ప్రయాణికులు సమయానికి తేరుకొని బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. విహారి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా బస్సు వెనుకభాగంలో మంటలు చెలరేగాయి. బస్సులో పొగలు వ్యాపించడంతో డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై అందరు 29 మంది ప్రయాణికులను వెంటనే కిందకు దింపారు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా బూడిదైపోయింది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చెవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 20 మంది మరణించిన విషాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ ఘటన మరువకముందే మరోసారి బస్సు అగ్ని కీలల్లో కాలిపోవడం రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







