తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసి తోటి (PVTG) తెగ ప్రజల చిరకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ‘తెలంగాణ ఆదివాసి తోటి PVTG సేవా సంఘం’ నేతలు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డిని కలిశారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో విస్తరించి ఉన్న తమ తెగ సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధాన డిమాండ్లు..
రేషన్ కార్డులు: ఏజెన్సీ ప్రాంతాల్లో లాగే మైదాన ప్రాంత తోటి కుటుంబాలకూ 30 కిలోల బియ్యం వచ్చేలా అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి.
ఉపాధి & విద్య: ట్రైకార్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు పంపిణీ చేయాలని కోరారు.
సాంస్కృతిక రక్షణ: తోటి తెగ విశిష్ట వాయిద్యాలైన బుర్ర – మద్దెలను ట్రైబల్ మ్యూజియంలో ప్రదర్శించాలి.
కుల ధ్రువీకరణ: కరీంనగర్ జిల్లాలో ‘రామజోగుల’ అనే వ్యక్తులు తోటి తెగ పేరుతో ప్రయోజనాలు పొందుతున్నారని, దీనిపై విచారణ జరపాలని విన్నవించారు.
అధికారుల హామీ..
సంఘం ప్రతినిధుల విజ్ఞప్తిపై అడిషనల్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించారు. పూర్తిస్థాయి కుటుంబ సర్వే రిపోర్టు అందజేస్తే, తక్షణమే విచారణ జరిపి అధికారిక కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. తోటి తెగ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
”మా విన్నపాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం సంతోషకరం. తోటి తెగ అభివృద్ధికి ఇది ముందడుగు.”అని సంఘం ప్రతినిధులు అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడప రఘు అలియాస్ గుర్రం రఘు, కోశాధికారి బిక్షపతి, సోయం గోవర్ధన్, సోయం శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.








