Khammam news : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం సీనియర్ నేత (CPM leader) సామినేని రామారావు (Samineni Ramarao ) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ రోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొందరు సామినేని రామారావుని గొంతు కోసి హత్య చేశారు. మరో మూడు రోజుల్లో ఖమ్మంలో రామారావు తన మనవరాలి పెళ్లికి ఉండగా ఇంతలో ఈ దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సామినేని రామారావు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు రామారావు. పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా కొనసాగారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి
కాగా, సామినేని రామారావు హత్య విషయం తెలుసుకుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో కలుషిత హింసా రాజకీయాలకు తావు లేదని అన్నారు. క్లూస్ టీం, స్నిఫర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా పోలీసులను ఆదేశించారు. సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    